మంత్రులు గ్రౌండ్ వర్క్ చేయట్లేదు: చంద్రబాబు
అసెంబ్లీలో చర్చల సమయంలో సరైన సమాచారాన్ని అందించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని తెలిపారు.;
అసెంబ్లీలో చర్చల సమయంలో సరైన సమాచారాన్ని అందించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. వారి ఆకాంక్షలు అసెంబ్లీలో కనిపించాలని సూచించారు. అయితే.. కొందరు మంత్రులు ఇప్పటికీ.. గ్రౌండ్ వర్క్ చేయట్లేదని ఆక్షేపించారు. సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారని, కానీ, అలా చేయడం సరికాదన్నారు.
తాజాగా మంగళవారం సాయంత్రం సుదీర్ఘంగా నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరిని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే సరైన వివరాలతో స్పందిస్తున్నారని.. మిగిలిన మంత్రులు మొక్కు బడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వచ్చే సమావేశాల్లో నిర్దిష్ట విధానం పాటించాలని సూచించారు. తాను కూడా ఏదైనా సబ్జెక్టుపై సభలో మాట్లాడాలని అనుకుంటే.. ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసుకునే సభకు వస్తున్నట్టు చెప్పారు.
ఇక, కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాజెక్టులను పెం చాలని నిర్ణయించారు. తద్వారా.. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చాలని.. చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. పెట్టుబడులకు అవసరమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా చొరవ చూపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విశాఖ పట్నంలో 2 వేల కోట్ల రూపాయలతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది.
నేను పవన్ వస్తాం.. కానీ..
అసెంబ్లీ సమావేశాల విషయంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు తాను తరచుగా వస్తానని.. తనతో మంత్రులకు ఎలాంటి పోలిక వద్దని చెప్పారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం.. సందర్భం మేరకు సభలో జరిగే చర్చల్లో పాల్గొంటామని చంద్రబాబు తెలిపారు.