టీడీపీలో కోవర్టులున్నారా ?
తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఉన్నారా అంటే అధినేత హోదాలో చంద్రబాబు మహానాడులో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అవునేమో అనిపిస్తుంది.;

తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఉన్నారా అంటే అధినేత హోదాలో చంద్రబాబు మహానాడులో చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక అవునేమో అనిపిస్తుంది. కోవర్టులు ఉన్నారని బాబు మహనాడు సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. పైగా వారంతా వైసీపీ నుంచి వచ్చిన వారు అని అంటున్నారు.
వారిని వలస పక్షులు అని పేరు పెట్టారు. వారు వస్తూంటారు, పోతూంటారు, కార్యకర్తలే ఎప్పటికీ శాశ్వతం అని కూడా బాబు అన్నారు. అయితే బాబు ఈ మాటలు అన్నపుడు వేదిక మీద చాలా మంది ముఖాలలో మార్పు కనిపించింది. నిజానికి 2014 నుంచి 2024 దాకా ఇంకా చెప్పాలీ అంటే ఈ రోజు దాకా వైసీపీకి వలేసి మరీ అనేక మంది నాయకులను తెలుగుదేశం పార్టీ తీసుకుంటోంది.
అలా వచ్చిన వారికి పదవులు కూడా కట్టబెడుతోంది. 2014 నుంచి 2019 మధ్యలో చూస్తే కనుక ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. వారిలో ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇతరులకు కీలకమైన బాధ్యతలు హోదాలు ఇచ్చారు. మరి ఆ వలస పక్షుల వల్ల పార్టీ బాగుపడలేదు, 2019లో ఓటమి పాలు అయింది. అందులో కూడా కొంతమంది కోవర్టులు ఉండే ఉంటారని అంటున్నారు.
ఇక ఇపుడు చూస్తే 2024 నుంచి ఈ రోజుకీ చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వారిలో కొందరు మంత్రులు అయ్యారు. మరి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. వారంతా అధికార రాజముద్రతోనే ఉంటున్నారు. మరి వలస పక్షులు వస్తారు పోతారు అని ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు ఈ ప్రకటన చేసినపుడు అలాంటి వారిని ఎందుకు చేర్చుకోవడం అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.
అంతే కాదు, టీడీపీకి నాయకుల కొరత ఏమీ లేదు కూడా. ఇలా వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ద్వారా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది కదా అన్న చర్చ కూడా ఉంది. అయినా సరే ఈ కండువాలు కప్పే కార్యక్రమం ఆగదు, మరి అది ఆగకపోతే అది పక్కా రాజకీయం అయితే అందులో వ్యూహం ఉంటే మరి దాని మీద విమర్శలు చేసుకోవడం కూడా వ్యర్థమే అని అంటున్నారు.
ఆ మాటకు వస్తే కోవర్టులు అన్ని పార్టీలలోనూ ఉంటారని అంటున్నారు. వారు వేరే పార్టీల నుంచి వచ్చిన వారే కానక్కరలేదు. ఉన్న పార్టీలో అవకాశాలు దక్కని వారు కూడా వేరే పార్టీలలో బెర్తులు పదిలం చేసుకోవడానికి కూడా ఈ రకంగా ఇక్కడి మాటలు అక్కడకు మోసుకుని వెళ్తారు అని అంటున్నారు. ఇదంతా ఈ రోజే మొదలు కాలేదు, ఎప్పటి నుంచో సాగుతోంది.
అందుకే దానికి అయారాం గయారాం అని పేరు పెట్టారు. మరి కార్యకర్తలే శాశ్వతం అన్నప్పుడు వలస పక్షులకు అడ్డుకట్ట వేయాలి. అధికారంలో ఉన్న పార్టీలో అయిదేళ్ళు అన్నీ అనుభవించి చివరి నిముషంలో ఈ వైపునకు వస్తే మళ్ళీ వారిని ఆదరించి పదవులు కట్టబెట్టడం వల్ల క్యాడరే నిజంగా నలిగిపోతుంది అని అంటున్నారు. వారే మళ్ళీ రాజ్యం చేస్తూంటే వారి కిందన పనిచేయడానికి క్యాడర్ మనసు చంపుకోవాల్సి వస్తోందని కూడా అంటోంది.
కార్యకర్తే అధినేత అన్న స్లోగన్ టీడీపీ ఈ మహానాడులో ఇచ్చింది. అది నిజంగా మంచి స్లోగన్. దానిని నినాదంగానే పరిమితం చేయకుండా ఉండాలంటే ఇతర పార్టీల నేతలను చేర్చుకోకుండా ఉండడమే బెస్ట్ అని అంటున్నారు. దాని వల్ల కోవర్టుల బెడద కూడా తగ్గుతుందని అంటున్నారు. నాయకుడు పార్టీ మారినా క్యాడర్ మారదు, పైగా ఆ వైపు నుంచి ఈ వైపునకు ఎవరైనా వచ్చినా వారితో కలసి పనిచేయడానికి కూడా ఇష్టపడదు. ఇది కేవలం టీడీపీకే కాదు అన్ని పార్టీలకూ వర్తించే సూత్రమే. బాబు కోవర్టులు అని అంటున్నారు కాబట్టి ఇతర పార్టీలకు టీడీపీ డోర్స్ క్లోజ్ చేయడమే మేలు అని కూడా సూచనలు వస్తున్నాయి.