రాజకీయాలు చేస్తే హైదరాబాద్ అభివృద్ధి జరిగేదే కాదు.. సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.;
రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు అవసరమే కానీ... సమాజం గురించి కూడా ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం... అభివృద్ధికి నిధులిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎంగా భావితరాల కోసం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 1995లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు సంపద పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్ పాలసీలు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం విజన్ కల్పన చేయటంతో పాటు దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాల కోసమే విజన్ను రూపొందించి అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యత అని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047 అమలు చేస్తుంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్దం చేసి అమలు చేస్తున్నామని వెల్లడించారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీల అవసరం అంతే ఉందని సీఎం అన్నారు. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్ రూపొందించి అమలు చేస్తున్నట్టు వివరించారు.
మూడేళ్లలో అమరావతి
అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని మూడేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తి అవుతాయన్నారు. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు చంద్రబాబు విమర్శించారు. ‘‘అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం." అని సీఎం వివరించారు.
అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగదు
"అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే. హైటెక్ సిటి రాక ముందు హైదరాబాద్ లో ఎకరం రూ. లక్ష ఉండేది...ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. పరిశ్రమలు, రహదారుల లాంటి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి నిరంతరం. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే... అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా గుంటూరు-విజయవాడ-తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందుతుందని చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో 2026 జనవరి నాటికి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి." అని ముఖ్యమంత్రి ప్రకటించారు.