"బాబుది విజ‌న్‌.. జ‌గ‌న్‌ది 'మావిగ‌న్‌': బోత్ ఆర్ నాట్ సేమ్‌!"

``సీఎం చంద్ర‌బాబుది విజ‌న్‌.. జ‌గ‌న్‌ది `మావిగ‌న్‌`... బోత్ ఆర్ నాట్ సేమ్‌!``- అని ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

Update: 2026-06-03 19:14 GMT

``సీఎం చంద్ర‌బాబుది విజ‌న్‌.. జ‌గ‌న్‌ది `మావిగ‌న్‌`... బోత్ ఆర్ నాట్ సేమ్‌!``- అని ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ వ్యాఖ్యానించారు. తాజాగా బుధ‌వారం రాజధాని అమ‌రావ‌తిలో పర్యటించిన మంత్రి నారాయణ.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు. చంద్ర‌బాబుకు-జ‌గ‌న్‌కు పోలిక లేద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం.. రాజ‌ధాని రైతులు కొంద‌రు.. జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ విష‌యంపై మీడియా మంత్రిని ప్ర‌శ్నించింది. అయితే.. వారు రాజ‌ధాని రైతులు కాద‌ని.. వైసీపీ నాయ‌కులు సృష్టించిన రైతుల‌ని వ్యాఖ్యానించారు.

రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అలానే.. రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూములు తీసుకుంటున్నార‌న్న ప్ర‌చారంలోనూ వాస్త‌వం లేద‌న్నారు. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకు ప్లాట్స్ ఇచ్చామని మంత్రి చెప్పారు. జగన్ ప‌నిగ‌ట్టుకుని అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమ‌ర్శించారు. ``జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి లో అభివృద్ధి ఏం కనిపిస్తుంది.. బయటకి వచ్చి చూస్తే తెలుస్తుంది.`` అని ఎద్దేవా చేశారు.

చంద్ర‌బాబు విజ‌న్.. మావిగ‌న్‌కు అర్ధం కాద‌ని ఎద్దేవా చేశారు. ``జగన్ అనే మావిగన్ ఎక్కడ ఉంది?. చంద్రబాబు కి విజన్ ఉంటే.. జగన్ కి మావిగ‌న్ అనే పిచ్చి మాత్ర‌మే ఉంద‌``ని వ్యాఖ్యానించారు. టెండర్ల‌ ప్రకారం అమరావతి లో అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతుల దగ్గర బలవంతంగా భూములు ఇంతవరకు తీసుకోలేదన్నారు. భూస‌మీక‌ర‌ణ ద్వారానే రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. రాజ‌ధానిలో మ‌ధ్య మ‌ధ్య ఉన్న భూములు ఇవ్వాల‌ని రైతుల‌ను ఇప్ప‌టికీ కోరుతున్నామ‌న్నారు.

భూములు ఇవ్వ‌ని వారిని అధికారులు ప‌లు విధాల న‌చ్చ‌చెబుతున్నార‌ని మంత్రి తెలిపారు. అయితే.. కొంద‌రు వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాయ మాట‌ల వ‌ల‌లో చిక్కుకుంటున్నార‌ని, దీంతో ఈ ప్ర‌క్రియ జ‌ఠిలం అవుతోంద‌ని అన్నారు. అమరావతి రాజ‌ధాని నిర్మాణాలు.. 2028 ఆగస్ట్ నాటికి తొలిద‌శ ప‌నులు పూర్త‌వుతాయ‌ని తెలిపారు. వర్షాకాలం వస్తోంది కాబట్టి కొండవీటి వాగు,పాలవాగు పనులు పరిశీలించిన‌ట్టు చెప్పారు. వర్షా కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజ‌ధాని ప‌నులు ముందుకు సాగాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాజ‌ధాని ప్రాంతంలో 69 బ్రిడ్జ్ ల ప‌నులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Tags:    

Similar News