మంత్రి వర్గ విస్తరణ...పవన్ సరికొత్త వ్యూహం !
ఏపీలో మరో నెల రోజులలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆగస్టు నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని అపుడు విస్తరణ చేపడతారు అని వార్తలు వస్తున్నాయి.
ఏపీలో మరో నెల రోజులలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆగస్టు నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని అపుడు విస్తరణ చేపడతారు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గంలో 24 మంది ఉన్నారు. ఒక బెర్త్ ఖాళీగా ఉంది. అయితే కొత్తగా చేపట్టే విస్తరణరలో కనీసంగా అరడజన్ మందిని తీసుకుంటారు అని వార్తలు వినవస్తున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వంలో మిత్ర పార్టీలు అయిన జనసేనకు బీజేపీకి మరింత ప్రాతినిధ్యం లభిస్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రెండు బెర్తులు అదనం :
జనసేన విషయం తీసుకుంటే రెండు బెర్తులు అదనంగా కేటాయిస్తారు అని అంటున్నారు. జనసేనకు ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొత్తగా విస్తరణ తరువాత ఈ సంఖ్య ఐదుకు చేరువ అవుతుందని అంటున్నారు. ఇక జనసేనలో ఇప్పటికే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కీలక హోదాలో ఉన్నారు. ఆయనకు అయిదు ప్రాధాన్యత కలిగిన శాఖలను కేటాయించారు. అలాగే మరో రెండు బెర్తులు కూడా ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ పనిచేస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు జత చేరుతారు అని అంటున్నారు.
కొణతాలకు చాన్స్ :
సీనియర్ నేత అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణకు గోల్డెన్ చాన్స్ దక్కుతుందని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ అనేక సమీకరణలను చూసి మరీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ప్రముఖ బీసీ నేతగా కొణతాల ఉన్నారు. విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు అసెంబ్లీ అలాగే అనకాపల్లి ఎంపీ సీటుని ప్రభావితం చేసే బలమైన గవర సామాజిక వర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో జనసేనను విస్తరించాలని రానున్న కాలంలో జనసేనను ఆ ప్రాంతంలో మరింతగా బలం పెంచేలా చేయాలని పవన్ వ్యూహ రచన చేస్తున్నారు. బీసీల జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రా నుంచి వివాద రహితుడు ఉత్తరాంధ్రా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న రామక్రిష్ణకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రానున్న కాలంలో ఉత్తరాంధ్రాలో పట్టు పెంచుకోవాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. జనసేన రాజకీయ పరంగా చూస్తే పవన్ కనుక కొణతాలను ఎంచుకుంటే అది వ్యూహాత్మకంగా సరైన నిర్ణయం అవుతుందని అంటున్నారు. జనసేనకు రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలో పట్టు మరింతగా పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అంటున్నారు.
నాగబాబుకు సైతం :
ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుంది అన్నదే ఆ ప్రచారం సారాంశం. ఆయన ఎమ్మెల్సీగా నెగ్గింది మంత్రి కావడానికి అని చెప్పుకున్నారు. ఇక చంద్రబాబు సైతం నాగబాబుని కేబినెట్ లోకి తీసుకుంటామని కూడా గతంలో హామీ ఇచ్చారు. ఆ విధంగా చూస్తే జనసేనకు మరో రెండు మంత్రి పదవులు దక్కినట్లే అని అంటున్నారు. ప్రభుత్వంలోనూ జనసేన వాయిస్ కూడా బాగా పెరుగుతుందని అలాగే పార్టీ పరంగా జనసేన మరింత పటిష్టం అయ్యేందుకు దోహదపడుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కొణతాలకు గోల్డెన్ చాన్స్ దగ్గరలోనే ఉంది అని అంటున్నారు.