రఘురామ వర్సెస్ జడ శ్రావణ్ : డీజీపీకి లేఖ
ఏపీ శాసన సభ ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు డీజీపీకి తాజాగా ఒక లేఖ రాశారు.
ఏపీ శాసన సభ ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు డీజీపీకి తాజాగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన మాజీ మేజిస్ట్రేట్ మరియు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్పై ఆరోపణలు చేసారు. ఏపీలో మత విద్వేషాలను ప్రేరేపించేలా వ్యవహరించిన జడ శ్రావణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు అని రఘురామ పేర్కొన్నారు. జడ శ్రావణ్ కుమార్ చేసిన ఆరోపణలు అలాగే ఆయన వ్యాఖ్యల మీద వాస్తవాలు పూర్తిగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాపై దురుద్దేశ ఫిర్యాదులు :
ఇదిలా ఉంటే తన మీద జడ శ్రావణ్ కుమార్ దురుద్దేశ పూర్వకంగా సామూహిక ఫిర్యాదులు చేయిస్తున్నారు అని రఘురామ డీజీపీకి రాసిన లేఖలో ఆరోపించడం విశేషం. అందువల్ల ఆయన చేసిన ఫిర్యాదులను పక్కన పెట్టాలని కూడా రఘురామ కోరారు. దళిత క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ బహిరంగంగానే మెసేజీలను జడ శ్రావణ్ కుమార్ చాలా మందికి పంపిస్తున్నారు, నేను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి సమాజంలో కులాలు మతాల మధ్య విభజన తీసుకుని వస్తున్నాను అని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని డీజీపీకి రాసిన లేఖలో రఘురామ క్రిష్ణం రాజు పేర్కొన్నారు.
అందరూ పాటించాల్సిందే :
ఈ తరహా ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లుగా రఘురామ చెప్పారు. తాను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నాను అని తాను చెప్పేది ఒక్కటే అని రాజ్యాంగం ప్రకారం అంతా నడచుకోవాలని అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం దళితులు ఎవరైనా క్రిస్టియన్ మతంలో చేరితే వారు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కోల్పోతారని మాత్రమే చెప్పాను అని రఘురామ అన్నారు.
రాజ్యాంగ బద్ధంగానే :
దీని మీద 2025 మార్చి 24న చింతాడ ఆనంద్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. మరో వైపు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండాలని ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. అదే కనుక జరిగితే ఈ తరహా డిమాండ్లు మరిన్ని పుట్టుకుని వస్తాయని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.
విచారించాలని కోరుతూ :
ఈ నేపధ్యంలో రఘురామ డీజీపీకి లేఖ రాసి అందులో అనేక అంశాలను పొందుపరిచారు. మత పరమైన విద్వేషాలను ప్రేరేపించే శక్తుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతే కాకుండా తనకు వ్యతిరేకంగా జడ శ్రావణ్ కుమార్ దళిత క్రిష్టియన్లకు బహిరంగ సదేశాలను పంపిస్తూ సామూహిక ఫిర్యాదులకు ప్రేరేపిస్తున్న విషయం మీద చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. మొత్తానికి రఘురామ మరో అడుగు ముందుకేసి ఈ విషయంలో గట్టిగా తేల్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.