'ప్ర‌క్రియ' ప్రారంభం.. అమ‌రావ‌తికి తిరుగుండ‌దు!

గ‌త 2024 వ‌ర‌కు ఏపీ-తెలంగాణ‌ల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంది. అయితే.. ప‌దేళ్ల‌లో ఏపీకి కొత్త రాజ‌ధాని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్ర‌భుత్వాలు మార‌డంతో ఇది ఆల‌స్య‌మైంది.;

Update: 2025-12-05 13:30 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇకపై ఎలాంటి తిరుగు ఉండ‌దు. ఒక‌వేళ ఏదైనా కార‌ణంగా.. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారినా.. అమ‌రావతి జోలికి పోకుండా.. ఉండేలా రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే దిశ‌గా అడుగులు ప‌డ్డాయి. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభం అయింది. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న చ‌ట్టం-2014లో ఉన్న సెక్ష‌న్ 5/2 ప్ర‌కారం.. ఏపీకి రాజధానిని గుర్తించాల్సి ఉంటుంది.

గ‌త 2024 వ‌ర‌కు ఏపీ-తెలంగాణ‌ల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంది. అయితే.. ప‌దేళ్ల‌లో ఏపీకి కొత్త రాజ‌ధాని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్ర‌భుత్వాలు మార‌డంతో ఇది ఆల‌స్య‌మైంది. ఇంత‌లో హైద‌రాబాద్ గ‌డువు తీరిపోయింది. ఈనేప‌థ్యంలో రాజ‌ధాని అమ‌రావ‌తిని అటు పార్ల‌మెంటు గుర్తించ‌డంతోపాటు.. ఇటు రాజ‌ధానిని స్థిరీక‌ర‌ణ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ప్ర‌క్రియ కోస‌మే గ‌త కొన్నాళ్లుగా రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మ‌రోసారి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చినా.. రాజ‌ధాని పై చేయి వేయ‌కుండా చేయాలంటే.. దీనిని చ‌ట్టంలోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం, చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రైతులు చెబుతున్నారు. దీని పై ఇట‌వ‌ల కాలంలో కొంత ఒత్తిడి కూడా తీసుకువ‌చ్చారు. మొత్తానికి తాజా పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశ పెడ‌తారు.

మొత్తంగా ఈ ప్ర‌క్రియ సాకారం అయ్యేందుకు రెండు వారాల పాటు వేచి ఉండ‌క త‌ప్ప‌దు. విభజన చట్టం 5(2) సెక్షన్ ప్రకారం.. హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అయితే, విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని పేరు ఎక్కడా పేర్కొనలేదు. దీంతో రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ కొన‌సాగుతోంది. 2015లో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినా, గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇప్పుడు అన్ని ప్ర‌క్రియ‌లు పుంజుకోనున్నాయి. త‌ద్వారా రాజ‌ధానికి భ‌ద్ర‌త ఏర్ప‌డ‌నుంది.

Tags:    

Similar News