ఆదివాసీ కామెంట్.. దేవరకొండకు చిక్కులు
అతడు ఇటీవల `రెట్రో`(సూర్య హీరో) ప్రచార వేదికపై చేసిన వ్యాఖ్యల్లో `ఆదివాసీలు` అనే పదం ఉపయోగించారు.;
మనోభావాలు దెబ్బ తినే కాలమిది. ఇప్పుడు డిక్షనరీలో చాలా పదాల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ పాఠాల్లో, కథల పుస్తకాల్లో రాసి ఉంచిన పాత చింతకాయ పడి కట్టు పదాలు కానీ, సూక్తులు, చలోక్తులు కానీ ఇప్పుడు పని చేయవు. నోరు జారితే మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పుడు అలా నోరు జారిన యువహీరో విజయ్ దేవరకొండను ఒకే ఒక్క పదం అడ్డంగా బుక్ చేసింది.
అతడు ఇటీవల `రెట్రో`(సూర్య హీరో) ప్రచార వేదికపై చేసిన వ్యాఖ్యల్లో `ఆదివాసీలు` అనే పదం ఉపయోగించారు. ఆ పదం తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతోంది. పహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ దేవరకొండ 500 ఏళ్ల కిందట ఆదివాసుల్లాగా దాడి చేసారు! అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఆదివాసీ సమాజం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదివాసీల మనోభావాల్ని దెబ్బ తీసాడని, కించపరిచాడని దేవరకొండపై న్యాయవాది కిషన్ లాల్ చౌహన్ ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఈ వివాదంలో న్యాయసలహా కోసం వేచి చూస్తున్న పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఇటీవల ఏపీలోని మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ సైతం విజయ్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని అనుసరించి ఇకపై ఎలాంటి తప్పిదాలు లేకుండా సెలబ్రిటీలు వేదికలపై ఆచితూచి ఆలోచించి మాట్లాడాలని అభిమానులు సూచిస్తున్నారు.