టాలీవుడ్లో వైలెంట్ కథల ట్రెండ్!
ప్రస్తుతం టాలీవుడ్లో యాక్షన్ కథల శైలి రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు వినోదం, ప్రేమ కథలకు ప్రాధాన్యమిచ్చిన కథానాయకులు ఇప్పుడు పక్కా రా అండ్ రస్టిక్ వైలెన్స్ నిండిన కథల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో యాక్షన్ కథల శైలి రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు వినోదం, ప్రేమ కథలకు ప్రాధాన్యమిచ్చిన కథానాయకులు ఇప్పుడు పక్కా రా అండ్ రస్టిక్ వైలెన్స్ నిండిన కథల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఎమోషన్స్, భారీ రక్తపాతంతో కూడిన డ్రామాను కోరుకుంటుం డటంతో టాలీవుడ్ యంగ్ హీరోలు తమ ఇమేజ్ను పూర్తిగా మార్చుకునేందుకు సిద్ద పడుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ వంటి హీరోలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ కథాంశాలతో ముందుకొస్తున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శ కత్వంలో బ్రిటిష్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న`రణబాలి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న సినిమాలో విజయ్ మునుపెన్నడూ చూడని ఉగ్రమైన రూపంలో కనిపించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఘర్షణలు, పోరాటాలు , రక్తపాతం ప్రధానాంశంగా సాగే ఈ కథలో భారీ స్థాయి యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. ప్రచార చిత్రాలతోనే అది ప్రూవ్ అయింది. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ .. వైలెంట్ ప్రాజెక్ట్గా ఫోకస్ అవుతుంది.
అలాగే నేచురల్ స్టార్ నాని `దసరా` చిత్రంతోనే ఊరమాస్ .. వైలెంట్ అవతారాన్ని రుచి చూపించారు. ఇప్పుడు అదే దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో కలిసి `ది పారడైజ్` అనే మరో భారీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. పూర్తిస్థాయి వైలెన్స్ ..ఎమోషన్స్ కలగలిపిన కథతో సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ ఒదెల శైలికి తగ్గట్టుగానే సహజ సిద్ధంగా ..రస్టిక్ కోణంలో ఉండే రక్తం చింతే పోరాట ఘట్టాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
సుప్రీమ్ హీరో సాయి తేజ్ కూడా వైలెంట్ ట్రెండ్లోకి అడుగుపెట్టారు. రోహిత్ కెపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సంబరాల ఏటిగట్టు` చిత్రంలో సాయితేజ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యం పగ, ప్రతీకారాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా రూపొందుతోంది. యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రంలో హైలైట్ గా ఉంటాయని.. సాయి ధరమ్ తేజ్ నటనలోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
యంగ్ హీరో శర్వానంద్ సైతం వైలెంట్ బాట పడటం విశేషం. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో శర్వానంద్ హీరోగా `భోగీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రక్తపాతం ప్రధానంగా సాగే ఈ కథలో శర్వానంద్ మునుపెన్నడూ లేని వైలెంట్ అవతార్లో కనిపించనున్నారు. శర్వానంద్ నుంచి ప్రేక్షకులు ఊహించని రేంజ్లో మాస్ యాంగిల్ లో శర్వా రోల్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇలా యంగ్ హీరోలంతా వైలెంట్ బాట పడుతున్నారు. మరి వీటి సక్సెస్ ఎలా ఉంటుందన్నది చూడాలి.