ప్రభాస్పై కామెంట్ చేసిన నటుడిపై బ్యాన్
దాదాపు 9 నెలల క్రితం ప్రభాస్ పై అవాకులు చవాకులు పేలిన ఈ అవకాశాల్లేని నటుడిపై డార్లింగ్ ఫ్యాన్స్ దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే.;
దాదాపు 9 నెలల క్రితం ప్రభాస్ పై అవాకులు చవాకులు పేలిన ఈ అవకాశాల్లేని నటుడిపై డార్లింగ్ ఫ్యాన్స్ దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో అనుచిత వ్యాఖ్యలతో అతడిని ట్రోలింగ్ చేసారు. కల్కి 2898 ఏడిలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు! అంటూ అతడు చేసిన కామెంట్ ప్రకంపనాలు పుట్టించింది. దిల్ రాజు, మంచు విష్ణు, నాని సహా చాలా మంది అర్షద్ వార్షీకి చీవాట్లు పెట్టారు.
ఇప్పుడు అర్షద్ వార్షీ చేసిన ఓ చెత్త పని తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అతడు `సాధన బ్రాడ్కాస్ట్` షేర్లను కొనుగోలు చేయమని పెట్టుబడిదారులను సిఫార్సు చేస్తూ యూట్యూబ్ ఛానెల్లలో తప్పుదారి పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్నాడు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ, ఆయన భార్య మరియా గోరెట్టి సహా మరో 57 మందిని సెబీ గురువారం (మే 29) సెక్యూరిటీస్ మార్కెట్ల నుండి 1-5 సంవత్సరాల వరకు నిషేధించింది. అర్షద్ వార్సీ అతడి భార్య మరియాపై నియంత్రణ సంస్థ సెబీ ఒక్కొక్కరికి రూ.5,00,000 జరిమానా విధించింది. సాధన బ్రాడ్కాస్ట్ (ఇప్పుడు క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లు సహా 57 ఇతర సంస్థలకు సెబీ రూ.5 లక్షల నుండి రూ.5 కోట్ల వరకు జరిమానాలు విధించింది. ఈ కంపెనీపై 58 కోట్ల ఫైన్ తో పాటు, 12 శాతం వడ్డీ ని చెల్లించాలని సెబీ ఆదేశించింది. అర్షద్ వార్సీ యూట్యూబ్ ప్రచారంతో రూ.42 లక్షల లాభం పొందారని, అతడి భార్య రూ.51 లక్షల లాభం పొందారని సెబీ గుర్తించింది.
ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేష్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబి కనుగొంది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ (SBL) ఆర్టీఏ డైరెక్టర్గా కూడా ఉన్న సుభాష్ అగర్వాల్, మనీష్ మిశ్రా సహా ప్రమోటర్ల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారని ఆర్డర్ పేర్కొంది. అర్షద్ వార్షీతో కలిసి వీరంతా మానిప్యులేటివ్ పథకాన్ని ప్లాన్ చేసి అమలు చేసారని సెబి తెలిపింది. పీయూష్ అగర్వాల్, లోకేష్ షా అనే వ్యక్తులు మ్యానిప్యులేషన్ స్క్రిప్టులో కీలక వ్యక్తులు అని సెబీ పేర్కొంది. అదేవిధంగా జతిన్ షా ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు, అయితే ఇతర సంస్థలు మానిప్యులేటివ్ డిజైన్లను సులభతరం చేశాయి. త్వరగా డబ్బు సంపాదించడానికి దానిలో భాగమయ్యాయని ఆర్డర్ పేర్కొంది. 109 పేజీల ఆర్డర్ లో ఎన్నో సంచలన నిజాలను బయటపెట్టారు. ఒక స్క్రిప్టు ప్రకారం షేర్ ధరలు పెరిగేందుకు పెద్ద స్కెచ్ వేసారని సెబీ నిర్ధారించింది.
ఈ పథకంలో తప్పుదారి పట్టించే వీడియోలను ప్రమోట్ చేయడానికి అర్షద్ వార్షీ, అతడి భార్య సహకరించారని కథనాలు పేర్కొన్నాయి. ధరల తారుమారుపై సెబీకి ఫిర్యాదు అందాక విచారణ మొదలైంది. దీనిలో ఈ నిజాలు నిగ్గు తేలాయి. రెగ్యులేటర్ 2023 మార్చి 2న 31 సంస్థలపై మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. 8 మార్చి 2022 నుండి 2022 నవంబర్ 30 వరకు ఎస్బిఎల్ స్క్రిప్లో తారుమారు వ్యవహారంపై సెబీ వివరణాత్మక దర్యాప్తు నిర్వహించింది. నటుడిగా అంతగా అవకాశాల్లేని అర్షద్ వార్షీ, ఇలా తప్పుడు విధానంలో ఆర్జిస్తున్నాడని మళ్లీ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాల్లో తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.