రవితేజ తండ్రి మృతి.. చిరంజీవి సంతాపం
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తన తండ్రి భూపతి రాజగోపాల్ రాజును కోల్పోవడంపై తెలుగు చిత్రసీమ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.;
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తన తండ్రి భూపతి రాజగోపాల్ రాజును కోల్పోవడంపై తెలుగు చిత్రసీమ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 90 ఏళ్ల వయసులోవయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈ మంగళవారం రాత్రి మరణించారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఈ విషాదకరమైన మరణం సంభవించింది.
రవితేజ స్వస్థలం జగ్గంపేట (ఆంధ్రప్రదేశ్). రాజగోపాల్ రాజు రిటైర్డ్ ఫార్మసిస్ట్. రాజగోపాల్ మరణం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది రవితేజకు తీవ్రమైన వ్యక్తిగత లోటు. ఈ క్లిష్ట సమయంలో సహచరులు, శ్రేయోభిలాషులు కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
రాజగోపాల్ రాజుకు భార్య రాజ్య లక్ష్మి, కుమారులు రవితేజ, రఘు రాజు ఉన్నారు. మరో కుమారుడు భరత్ రాజు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
అన్నయ్య చిరంజీవి సంతాపం:
రవితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుందని తెలిసి మెగాస్టార్ చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేసారు. చిరంజీవి మాట్లాడుతూ.. ``సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా `వాల్తేర్ వీరయ్య` సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.