రామాయణ గ్లింప్స్..మహేష్పై నెట్టింట చర్చ!
దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న భారీ మైథాలిజకల్ ప్రాజెక్ట్ `రామాయణ`. రెండు భాగాలుగా రానుంది.;
దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న భారీ మైథాలిజకల్ ప్రాజెక్ట్ `రామాయణ`. రెండు భాగాలుగా రానుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో భారతీయ సినీ చిత్రలోనే సరికొత్త టెక్నాలజీతో నమిత్ మల్హోత్రా, కన్నడ స్టార్ హీరో యష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిర్మాణం నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సన్నీడియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, అరుణ్ గోవిల్, లారా దత్తా, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు.
ఇటీవలే దీని టీజర్ని హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ లుక్ని ఈ గ్లింప్స్లో రిలీజ్ చేయడంతో దీనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాల తరహాలో వీఎప్ ఎక్స్ వర్క్ ఉందని, రావణుడి పుష్పక విమానం, అబ్బుర పరిచే బ్యాగ్రౌండ్ విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మర్యాద పురుషోత్తముడిగా శ్రీరాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ని చూపించిన తీరు, శ్రీరాముడి పట్టాభిషేకం, అరణ్యవాసం ఘట్టాల నేపథ్యంలో చూపించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఐమ్యాక్స్ టెక్నాలజీతో అత్యంత మనోహరంగా వెండితెరపై ఆవిష్కరిస్తున్న సుందర కావ్యంగా ఆవిష్కరిస్తున్నారని గ్లింప్స్ విజువల్స్ తో స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అంతే కాకుండా ఈ వీడియోలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ని చూపించిన తీరు, అతని ఆహార్యం, తను ఆయోధ్యలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, భారీ రాజ ప్రసాదాలని తలపించే సెట్లు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే నెట్టింట ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటి వరకు నేటి తరం హీరోల్లో ప్రభాస్ శ్రీరాముడిగా `ఆదిపురుష్`లో కనిపించాడు. ప్రభాస్ శ్రీరాముడి లుక్తో పాటు విజువల్ ఎఫెక్ట్స్పై తీవ్ర విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. ఆదిపురుష్లో శ్రీరాముడిగా ప్రభాస్ మీసకట్టుతో కనిపించడం, గ్రాఫిక్స్ నాసికరంగా ఉండంటతో విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ఇప్పుడు `రామాయణ`లో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తుండటం, గ్లింప్స్లో శ్రీరాముడిగా రణ్బీర్ ని పరిచయం చేయడంపై కొంత వరకు ప్రేక్షకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమైనా కానీ కొంత విమర్శలు మాత్రం మొదలయ్యాయి.
వీఎఫ్ ఎక్స్ తో పాటు శ్రీరాముడిగా రణ్బీర్ కరెక్ట్గా సూటవ్వలేదనే చర్చ మొదలైంది. ఇదే సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న `వారణాసి`లో శ్రీరాముడిగా కనిపించనున్న మహేష్ లుక్పై అంతా చర్చిస్తున్నారు. ప్రభాస్, రణ్బీర్ తేలిపోయారని, మహేష్ ఆ లోటుని తీర్చి అబ్బుర పరుస్తాడని అంతా అంటున్నారు. త్రేతాయుగానికి సంబంధించిన కీలక ఘట్టంలో మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. మహేష్ శ్రీరాముడిగా నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడని, మహేష్ శ్రీరాముడి గెటప్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో నెట్టింట జక్కన్న `వారణాసి` ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది.