ప్రభాస్ సినిమా వల్లే 'రెట్రో' ఛాన్స్‌..!

టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా కొన్నాళ్లు వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఒక్కసారిగా ఆఫర్లు కోల్పోయింది.;

Update: 2025-04-24 11:51 GMT

టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా కొన్నాళ్లు వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఒక్కసారిగా ఆఫర్లు కోల్పోయింది. తెలుగులో ఈమె నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ నిరాశ పరచడంతో పాటు, అందరు హీరోలతో సినిమాల్లో నటించడంతో స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దాదాపుగా కరువు అయ్యాయి. దాంతో ఈమె హిందీ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడ లక్కీగా తెలుగులో చేసిన సినిమాల కారణంగా ఆఫర్లు బాగానే వచ్చాయి. హిందీలో ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈమె రెట్రో సినిమాలో నటించింది.

సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'రెట్రో' సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. ఆ సినిమాలోని పూజా హెగ్డే లుక్‌కి మంచి స్పందన లభించింది. టీజర్‌ మొదలుకుని ప్రతి ప్రమోషన్‌ వీడియో, పోస్టర్‌లో పూజా హెగ్డే లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో పూజా హెగ్డే కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న సినిమాల అన్నింటిలోకి ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె కూడా ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉంది. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

పూజా హెగ్డే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రెట్రో సినిమా నన్ను పూర్తి విభిన్నంగా చూపించబోతోంది. నా నటన సామర్థ్యంను చూపించే విధంగా ఉంటుంది. యాక్షన్‌, డాన్స్‌, ఎమోషన్స్‌ ఇలా అన్ని చూపించేందుకు నాకు అవకాశం దక్కింది. సినిమా స్క్రిప్ట్‌ గురించి చర్చించేందుకు దర్శకుడు కలుద్దామని చెప్పినప్పుడు మేకప్‌ లేకుండా రమ్మన్నారు. నాకు చాలా కాలంగా మేకప్‌ లేకుండా నటించాలనే కోరిక ఉంది. ఆయన మేకప్‌ లేకుండా రమ్మనడంతో మరింత ఆసక్తి పెరిగింది. ప్రభాస్ 'రాధేశ్యామ్‌' సినిమాలో నన్ను చూసి, నా ఎక్స్‌ప్రెషన్స్‌, యాక్టింగ్ స్కిల్స్ చూసి రెట్రోకి ఎంపిక చేసినట్లు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఆ సమయంలో చెప్పుకొచ్చారు.

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న నాకు తమిళ్‌లో మొదటి ఆఫర్‌ దక్కింది. టాలీవుడ్‌ నాకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కకునే సత్తా ఇస్తే, కోలీవుడ్‌ మొదటి ఆఫర్‌ను ఇచ్చింది. అది ఎప్పటికీ మరచిపోలేను. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాలను ఇష్టం లేకుండానే చేయాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు ఎలా నో చెప్పాలో తెలియక ఓకే చెప్పాను. ఆ సినిమాల్లోని పాత్రలు ఇష్టం లేకుండానే చేయాల్సి వచ్చింది. కానీ రాను రాను నేను ఎంపిక చేసుకునే ప్రాజెక్ట్‌ల విషయంలో స్పష్టత వచ్చింది. నో చెప్పడం నేర్చుకున్నాను. మంచి కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాను అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. తెలుగులో ఈ అమ్మడి రీ ఎంట్రీ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News