బాధపడ్డ ఇళయరాజా.. ఆ డైలాగ్ తీసేశారు
పుష్కర కాలానికి పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న తమిళ స్టార్ హీరో సూర్య ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ విజయాన్ని అందుకున్నాడు ‘కరుప్పు’ చిత్రంతో.
పుష్కర కాలానికి పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న తమిళ స్టార్ హీరో సూర్య ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ విజయాన్ని అందుకున్నాడు ‘కరుప్పు’ చిత్రంతో. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ మూవీ.. తెలుగులోనూ నెగెటివ్ టాక్ను తట్టుకుని మంచి వసూళ్లే రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా తమిళంలో ఈ చిత్రానికి వసూళ్లు బాగున్నాయి. ఇలాంటి టైంలో ఒక చిన్న వివాదం ‘కరుప్పు’ సినిమాను చుట్టుముట్టింది. ఈ చిత్రంలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను అవమానించేలా డైలాగ్ పెట్టారంటూ ఆయన అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇళయరాజా కూడా ఈ డైలాగ్ విషయంలో బాధ పడ్డట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ సెకండాఫ్లో విజయ్ కాంత్ పాత పాట వినిపిస్తుంది. ఐతే తన పాటలను సినిమాల్లో వాడుకుంటే కాపీ రైట్ కింద ఇళయరాజా నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఇటీవల ఆయనకే తన పాటల మీద హక్కు లేదంటూ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ‘కరుప్పు’లో ఇళయరాజా కాపీ రైట్ కేసులు పెట్టడం మీద ఒక సెటైరికల్ డైలాగ్ పెట్టారు. దీనిపై ఇళయరాజా అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇళయరాజా చేసేదాంట్లో తప్పేముందని, అలాంటి దిగ్గజం మీద సెటైర్లు వేస్తారా అంటూ మండిపడ్డారు. ఇళయరాజా కూడా బాధ పడ్డట్లు తెలియడంతో ‘కరుప్పు’ టీం అప్రమత్తమైంది. ఈ డైలాగ్ను సినిమా నుంచి తొలగించడంతో పాటు ఇళయరాజాకు క్షమాపణ కూడా చెప్పింది. ‘‘ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేసిన సేవలు ఎన్నో తరాలకు స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయన్ని ఉద్దేశించి పెట్టిన డైలాగ్ విషయంలో ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఆయన మనోభావాలను దెబ్బ తీయడం, అగౌరవపరచడంమా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన్ని ఉద్దేశిస్తూ పెట్టిన డైలాగులను తీసేస్తున్నాం. ఆయనకు క్షమాపణలు కూడా చెబుతన్నాం’’ అని కరుప్పు టీం ప్రకటించింది.