ఇంద్రగంటి ఫాలో అవుతున్న విచిత్రమైన సెంటిమెంట్
మనిషి అన్న తర్వాత ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్స్ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.;

మనిషి అన్న తర్వాత ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్స్ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక సినిమాకు ఏదైనా చేసి అది కలిసొస్తే, దాన్ని ప్రతీ సినిమాకీ ఫాలో అవుతూ దాన్ని సెంటిమెంట్ కింద మార్చేసుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలోని వాళ్లు. టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ సెంటిమెంట్స్ ను బాగా నమ్ముతూ ఉంటారు.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు తన ప్రతీ సినిమా కథనీ బ్యాంకాక్ లో రాసుకునే సెంటిమెంట్ ఉందనే విషయం తెలిసిందే. అలానే అనిల్ రావిపూడికి తన సినిమా కథను వైజాగ్ లో రాసుకుని ఆ తర్వాత సింహాచలం అప్పన్న దగ్గర పూజ చేయించే సెంటిమెంట్ ఉందని కూడా తెలుసు. ఇప్పుడలానే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణకు కూడా ఓ సెంటిమెంట్ ఉందన్న విషయం బయటపడింది.
ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం ప్రమోషన్స్ లో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెన్నెలకిషోర్, ఇంద్రగంటిని మీరు ఇప్పటికీ ఫాలో అయ్యే సెంటిమెంట్ ఏంటని అడిగ్గా ఆయన అది సీక్రెట్ అని, ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని, తాను ప్రతీ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు మొదటి పేపర్ లో ముందుగా ఓం నషస్మి అని రాస్తా అని తెలిపారు.
అందరూ దాన్ని చూసి ఏదో మంత్రం అనుకుంటారని కానీ అది మంత్రం కాదని అసలు విషయాన్ని వెల్లడించారు. ఓం నషస్మి అంటే ఓంపురి, నజీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్ అని, షార్ట్ కట్ లో ఓం నషస్మి అని రాసుకుంటానని, వాళ్లంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే వారి పేర్లతో సినిమా స్క్రిప్ట్ ను మొదలుపెడతానని ఇంద్రగంటి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.