గ్రాఫిక్స్ వద్దు రియాలిటీ ముద్దు.. `దురంధర్ 2` క్లైమాక్స్ కోసం 500లీటర్ల పెట్రోల్
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద `ధురంధర్: ది రివెంజ్` ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా కలెక్షన్ల పరంగానే కాకుండా.. మేకింగ్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది.;
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద `ధురంధర్: ది రివెంజ్` ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా కలెక్షన్ల పరంగానే కాకుండా.. మేకింగ్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణంతో దర్శకుడు ఆదిత్య ధర్ వెండితెరపై ఒక దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా సినిమా ముగింపులో వచ్చే క్లైమాక్స్ సన్నివేశం గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా చర్చించుకుంటోంది.
ఈ సినిమా క్లైమాక్స్లో రణవీర్ సింగ్- అర్జున్ రాంపాల్ మధ్య సాగే పోరాట సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలిచింది. సాధారణంగా ఇలాంటి భారీ విస్ఫోటనాలు లేదా అగ్నిప్రమాద దృశ్యాల కోసం దర్శకులు గ్రాఫిక్స్ లేదా విఎఫ్ఎక్స్ పై ఆధారపడుతుంటారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం ఇందుకు భిన్నంగా పూర్తి సహజత్వాన్ని కోరుకున్నారు. అందుకే ఈ సినిమాలో ఎక్కడా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడకుండా.. నిజమైన సెట్స్.. పేలుళ్లతో ప్రేక్షకులను థ్రిల్ చేశారు.
క్లైమాక్స్లో కనిపించే ఆ భారీ అగ్నిప్రమాదం వెనుక ఉన్న కృషి సామాన్యమైనది కాదు. కేవలం ఆ ఒక్క సన్నివేశం కోసమే దాదాపు 500 లీటర్ల ఇంధనాన్ని (పెట్రోల్) వాడినట్లు సమాచారం. గాలిలో ఎగిరే కార్లు.. వాటి మధ్య నుంచి దూసుకువచ్చే హీరోల పోరాటాలు అవన్నీ చూస్తుంటే ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతి కలుగుతోంది. ఇంతటి భారీ స్థాయిలో మంటలను సృష్టించి.. వాస్తవానికి దగ్గరగా యాక్షన్ సీక్వెన్స్లను ప్లాన్ చేయడం భారతీయ సినిమాలో అరుదైన విషయమని చెప్పవచ్చు.
కేవలం సాంకేతిక బృందమే కాకుండా.. నటీనటులు కూడా ఈ సీన్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రమాదకరమైన మంటల మధ్య రణవీర్ సింగ్ .. అర్జున్ రాంపాల్ ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఇద్దరు నటుల మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ .. వారి ఎనర్జీ ఈ ప్రతీకార పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. రణవీర్ జోరుకు.. అర్జున్ రాంపాల్ గాంభీర్యం తోడవ్వడంతో క్లైమాక్స్ సీన్ ఒక యాక్షన్ ఉత్సవంలా మారింది.
దర్శకుడి విజన్- టెక్నికల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తల వల్లే ఈ సాహసం సుసాధ్యమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాల మధ్య ఈ షూటింగ్ పూర్తి చేశారు. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా.. ఈ క్లైమాక్స్ విశేషాలే బాక్సాఫీస్ వద్ద సినిమాను నిలబెడుతున్నాయి. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ చేసిన ఈ ప్రయత్నం.. యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. ఆసక్తికరంగా రణ్ వీర్ సింగ్ - ఆదిత్యా ధర్ జోడీ మరోసారి భారీ మల్టీస్టారర్ కోసం ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ధర్ సూపర్ హీరో కాన్సెప్టుపై పని చేస్తున్నారు. 2027 మార్చిలో సినిమా ప్రారంభం కానుంది.