'ట్యాక్సీవాలా' ప్రమోషన్‌ కు రావద్దనుకున్నా!

Update: 2018-11-16 03:30 GMT
విజయ్‌ దేవరకొండ మరికొన్ని గంటల్లో ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. గీతా గోవిందం చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం భారీగా పెరిగింది. ఇటీవల ‘నోటా’ విడుదలై ఆకట్టుకోలేక పోయినా కూడా ‘ట్యాక్సీవాలా’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్‌ దేవరకొండ మూవీ అనగానే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా మొత్తంగా పైరసీ వల్ల నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఈ సమయంలో విజయ్‌ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో.. ట్యాక్సీవాలా చిత్రం ప్రమోషన్‌ లో నేను పాల్గొనానుకోలేదు. గీత గోవిందం చిత్రానికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. ప్రచారం సమయంలో చాలా బిజీగా గడిపాను. ఆ తర్వాత నోటా కోసం చెన్నై - హైదరాబాద్‌ ల్లో ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు కార్యక్రమాల్లో పాల్గొని నా గురించి, సినిమాల గురించి చెప్పాను. అందుకే ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్‌ సమయంలో నేను పెద్దగా చెప్పేది ఏమీ లేదు, అందుకే పెద్దగా ప్రమోషన్స్‌ లో పాల్గొనాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కాని సినిమా పైరసీ అయిన నేపథ్యంలో దర్శకుడు, హీరోయిన్‌, సినిమాటోగ్రాఫర్‌ ఇలా చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అంటూ వారు భయపడుతున్న సమయంలో నేను వారి కోసం ప్రమోషన్స్‌ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. వారందరికి కూడా కెరీర్‌ ఆరంభం కనుక భయం ఉండటం సహజం. నాకు ఇదే పరిస్థితి పెళ్లి చూపులు సమయంలో జరిగి ఉంటే ఖచ్చితంగా నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు. సినిమా పైరసీ అయినా కూడా ప్రేక్షకులు తమ సినిమాపై ఆధరణ చూపుతారనే నమ్మకం ఉందని విజయ్‌ దేవరకొండ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Tags:    

Similar News