శ్రీదేవి చెప్పిందనే ఆ సినిమా చేశాడట

Update: 2018-04-17 12:55 GMT
జాతీయ అవార్డుల్లో మరోసారి ఎ.ఆర్.రెహమాన్ పేరు వినిపించింది. ఆయన ఆరోసారి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. గత ఏడాది రెహమాన్ పని చేసిన ‘మామ్’.. ‘కాట్రు వేళయిదే’ (తెలుగులో ‘చెలియా) సినిమాలకు గాను జ్యూరీ సభ్యులు ఆయనకు పురస్కారం కట్టబెట్టారు. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులే గెలిచిన రెహమాన్ కు జాతీయ అవార్డు అనేది చిన్నదే. కానీ రెహమాన్ మాత్రం ఈ అవార్డు గొప్ప గౌవరమంటూ వినమ్రంగా మాట్లాడాడు. ‘మామ్’ సినిమాకు పని చేయడం.. దానికి అవార్డు దక్కడం ప్రత్యేకమైన విషయాలని అతనన్నాడు. శ్రీదేవి చివరగా నటించిన సినిమాకు తాను సంగీతం అందించడంపై రెహమాన్ ఉద్వేగంగా స్పందించాడు.

శ్రీదేవి చెప్పందనే ఈ చిత్రానికి తాను పని చేసినట్లు రెహమాన్ వెల్లడించాడు. ‘మామ్’ సినిమా మొదలు కావడానికి ముందు శ్రీదేవి ఒకసారి చెన్నై వచ్చిందని.. ఆ సందర్భంగా తనను కలిసి ఈ సినిమా గురించి చెప్పిందని రెహమాన్ వెల్లడించాడు. తనతో కలిసి పని చేయాలని ఉందని.. ‘మామ్’కు సంగీతం అందించమని ఆమె కోరడంతో ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పాడు. శ్రీదేవితో పని చేయడం ప్రత్యేకమైన అనుభూతి అని.. ఆమె ఇంత హఠాత్తుగా చనిపోవడం బాధాకర విషయమని రెహమాన్ అన్నాడు. ఇక మణిరత్నంతో పని చేయడం తనకెప్పుడూ ప్రత్యేకమే అని.. ‘కాట్ర వేళయిదే’కు అవార్డు దక్కడమూ సంతోషమని రెహమాన్ అన్నాడు. సంగీత దర్శకుడిగా తనకు లైఫ్ ఇచ్చింది మణిరత్నమే అని.. తాను ఎలాంటి ట్యూన్ ఇచ్చినా అందులో కొత్తదనం వెతుక్కుని తన సినిమాకు మణిరత్నం వాడుకుంటాడని రెహమాన్ చెప్పాడు.
Tags:    

Similar News