అన్నమయ్యలో రెండు పాత్రలూ మార్చేశారు!

Update: 2016-08-20 13:30 GMT
అన్న‌మ‌య్య‌... ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన ఈ చిత్రం సూప‌ర్ డూపర్ హిట్ అయింది. తాళ్ల‌పాక అన్న‌మాచార్యుని జీవితాన్ని - శ్రీ వేంక‌టేశ్వరుని మీద ఆయ‌న‌కి ఉన్న భ‌క్తిని అద్భుతంగా తెర‌కెక్కించారు రాఘ‌వేంద్ర‌రావు. ఆ చిత్రంలో ఇద్ద‌రు భార్యలు వెంటప‌డుతూ సాగిన ఎపిసోడ్‌ లో ఎంత రొమాంటిక్‌ గా సాగిందో అంద‌రికీ తెలిసిందే. అయితే, అన్న‌మ‌య్య చిత్రంలోకి కీల‌క పాత్ర‌ల‌కు సినిమాటిక్ మార్పులు చేసి, అస‌లు విష‌యాల‌ను త‌ప్పుతోవ ప‌ట్టించారు అని చెబుతున్నారు ప్ర‌ముఖ గాయ‌ని శోభారాజ్‌. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా విజ‌య‌వాడలోని క‌ళా వేదిక‌పై త‌న గానామృతాన్ని పంచేందుకు వ‌చ్చారు. అన్నమాచార్య సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు శోభారాజ్. నేదునూరి కృష్ణ‌మూర్తి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి - త‌రువాత అన్న‌మ‌య్య కీర్త‌న‌ల ఆలాప‌నే జీవితాన్ని అంకితం చేశారు.

విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన శోభారాజ్ ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా త‌న జీవిత విశేషాల‌ను పంచుకుంటూ - చివ‌రిలో అన్న‌మ‌య్య సినిమా ప్ర‌స్థావ‌న తీసుకొచ్చారు. అన్న‌మాచార్య జీవితంపై తెర‌కెక్కిన చిత్రం త‌ప్పుదారి ప‌ట్టించింద‌ని ఆమె అన్నారు. ఆ సినిమాలో అన్న‌మ‌య్య పాత్ర - సాళువ న‌ర‌సింహ‌రాయ‌లు పాత్ర‌లను మ‌ల‌చిన తీరు బాగోలేద‌ని చెప్పారు. సాళువ న‌ర‌సింహ‌రాయ‌లు పాత్ర‌ను హాస్య‌పాత్ర‌గా ద‌ర్శ‌కుడు మార్చేసి - చిత్రీక‌రించిన తీరు బాగోలేద‌ని ఆమె విమ‌ర్శించారు. అన్న‌మ‌య్య పాత్ర‌ను చూసిన తీరుపై కూడా ఆమె అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఇద్ద‌రు భార్య‌ల వెంటప‌డ‌టం కూడా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌తోవ ప‌ట్టించేదిగానే చిత్రీక‌రించార‌ని శోభారాజ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో, నిజంగానే అన్న‌మ‌య్య చిత్రంలోని పాత్ర‌లను సినిమాటిక్ లిబ‌ర్టీ పేరుతో ఎక్కువ‌గా మార్చేశారా అనే అనుమానం క‌లుగుతోంది. ఎందుకంటే, అన్న‌మాచార్య జీవితంపై శోభారాజ్ ఎంతో అధ్య‌య‌నం చేశారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను సామాన్య‌లుకు కూడా అర్థ‌మ‌య్యే రీతిలో ఆరాధ‌నా భావంతో ప్రాచుర్యం క‌ల్పిస్తున్నారు. మ‌రి, అన్న‌మ‌య్య సినిమా త‌ప్పుదారి ప‌ట్టింద‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతుంది.
Tags:    

Similar News