జక్కన్న అప్పటికి 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కంప్లీట్ చేస్తాడా..?

Update: 2020-12-05 10:53 GMT
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'ఆర్.ఆర్.ఆర్' ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఇద్దరి హీరోల ఎంట్రీ వీడియోస్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవడంతో ముందుగా చెప్పినట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. బ్రేక్ లేకుండా డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాడు. ఇటీవలే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసిన జక్కన్న.. మహాబలేశ్వర్ లో చిన్న షెడ్యూల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మహాబలేశ్వర్ షూట్ ని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా తదుపరి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్లాన్ చేసిందట. ఈ షెడ్యూల్ లో చరణ్ కి జోడీగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా పాల్గొనే అవకాశముందని టాక్ నడుస్తోంది. అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ 2021 మార్చి నాటికి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రీకరణ కంప్లీట్ చేయాలని జక్కన్న డిసైడైనట్లు సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాగా, ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలియా భట్‌ - ఒలీవియా మోరిస్‌ వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దీనికి కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News