తెలుగు సినిమాలకు తీరిక లేదంట

Update: 2018-02-14 17:30 GMT
నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు యాక్టర్ గా పేరొచ్చింది తెలుగులో. చాలా తక్కువ టైంలోనే ఆమె స్టార్ హీరోయిన్ రేంజికి చేరుకుంది. వరస హిట్లతో టాప్ హీరోలందరి పక్కన నటించింది. ఈమధ్య ఇటు కోలీవుడ్.. అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడం మొదలెట్టింది. దీంతో ఇప్పుడు ఈ సుందరిని తెలుగు చేయడం లేదేమని అడిగితే తీరిక లేదంటూ కొత్త రాగం అందుకుంది.

రకుల్ బాలీవుడ్ లో తొలిసారిగా అయ్యారీ సినిమాలో నటించింది. నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపుగా పూర్తయింది. ఇంతలోనే అజయ్ దేవగన్ హీరోగా నటించే తరవాత సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా ఎంపికైంది. అటు కోలీవుడ్ లో గతేడాది కార్తి పక్కన తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలో నటించింది. ఇది తెలుగులో ఖాకీగా డబ్ అయింది. ఈ సినిమా తరవాత రకుల్ ఏకంగా మూడు తమిళ సినిమాలకు ఓకే చెప్పింది. కార్తితోపాటు అతడి అన్న సూర్య పక్కన ఒకేసారి హీరోయిన్ గా నటిస్తోంది. రెమో ఫేం శివ కార్తికేయన్ సినిమాలోనూ రకుల్ కథానాయికగా చేస్తోంది.

బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించే సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్టయింది. మరోవైపు తమిళంలోనూ వరసగా ఆఫర్లు ఒప్పేసుకుంది. దీంతో ఇప్పుడు తెలుగు మాటెత్తితే తరవాత చూద్దామని అంటోంది. తెలుగు సినిమాలతో వెండితెరకు పరిచయమైన ఇలియానా.. తాప్సీ కూడా బాలీవుడ్ కు వెళ్లాక తిరిగి ఇక్కడ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. చూస్తుంటే రకుల్ కూడా అదే పద్ధతిలో వెళ్తున్నట్టుందే.
Tags:    

Similar News