కింగ్ సెంచరీ వ్యవహారమంతా సైలెంట్గా!
ఈ సినిమా అధికారికంగా సెట్స్పైకి వెళ్లిన కొత్తలో చిత్ర యూనిట్ నుంచి కొన్ని క్రేజీ షూటింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి.
కింగ్ నాగార్జున 100వ చిత్రం అభిమానులకు సినిమా మాత్రమే కాదు. అదొక అతిపెద్ద పండుగ. ఈ ప్రతిష్టాత్మక మైలురాయి చిత్రంపై పరిశ్రమ సహా ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. యువ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. నాగార్జున కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ ల్యాండ్మార్క్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అక్కినేని వారసత్వ రికార్డులను తిరగరాసేలా కథ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ సినిమా అధికారికంగా సెట్స్పైకి వెళ్లిన కొత్తలో చిత్ర యూనిట్ నుంచి కొన్ని క్రేజీ షూటింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి.
నాగార్జున సరికొత్త లుక్, సినిమా బ్యాక్డ్రాప్ గురించి ఆసక్తికర విశేషాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత చిత్ర బృందం ఒక్కసారిగా కంప్లీట్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ గురించి కానీ, తదుపరి షెడ్యూల్స్ గురించి కానీ ఎలాంటి ప్రకటనలు రాకపోవడం అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. అసలు సెట్స్పై ఏం జరుగుతోంది? తాజా అప్డేట్ ఏంటి? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.
ఈ సుదీర్ఘ నిశ్శబ్దం వెనుక పక్కా వ్యూహాత్మక ప్లాన్ ఉన్నట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. నేటి డిజిటల్ యుగంలో ల్యాండ్మార్క్ సినిమాలకు సంబంధించిన లుక్స్, సీన్లు చాలా త్వరగా లీక్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున సరికొత్త గెటప్ను - సినిమాలోని కీలకమైన ఎలిమెంట్స్ను ఎక్కడా బయటకు రాకుండా దాచడానికే రా కార్తీక్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారట. ఎలాంటి హడావుడి, పబ్లిసిటీ ప్రెజర్ లేకుండా అవుట్పుట్ను పక్కాగా రాబట్టడం పైనే చిత్ర యూనిట్ పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.
అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ -ఎమోషనల్ షెడ్యూల్ ఎలాంటి హాడావుడి లేకుండా ఇటీవలే సైలెంట్గా పూర్తి చేసారుట. నాగార్జున కెరీర్ 100వ చిత్రం కావడంతో ప్రతీ సీన్ పర్ఫెక్ట్గా వచ్చేలా దర్శకుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసి పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ చిత్రంలో హై-ఎండ్ టెక్నికల్ వాల్యూస్ ఉండబోతున్నాయని అందువల్లే షూటింగ్తో పాటు పారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ పనులను కూడా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారని తెలుస్తోంది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారట.
అక్కినేని సెంచరీ చుట్టూ ఉన్న నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే రోజుల్లో ఒకేసారి పవర్ఫుల్ ఫస్ట్లుక్ -టైటిల్ అనౌన్స్మెంట్తో బాక్సాఫీస్ వద్ద పెద్ద ధమాకా చేయడానికి మేకర్స్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. హడావుడి చేసి అంచనాలు పెంచడం కంటే కంటెంట్తోనే షాక్ ఇవ్వాలనే కింగ్ నాగార్జున ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో? 100వ చిత్రం టాలీవుడ్ హిస్టరీలో ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో? చూడాలి.