డైరెక్టర్ గా 2దశాబ్దాలు పూర్తిచేసిన ఇస్మార్ట్ డైరెక్టర్

Update: 2020-04-20 06:10 GMT
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇండ‌స్ట్రీ ప్రస్థానం నేటితో 20ఏళ్ళు పూర్తిచేసుకుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన తన తొలి చిత్రం బ‌ద్రి సినిమాని రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. తొలి చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న పూరీ అదే ఉత్సాహంతో  జగపతిబాబుతో బాచి సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఆ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి వంటి వరుస సూపర్ హిట్లతో అంచెలంచెలుగా ఎదిగి 2006లో తెర‌కెక్కించిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ లో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు.

ఈ సినిమా పాత రికార్డుల‌ని చెరిపేసి బాక్సాఫీస్ బాద్షాగా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన దేశముదురు కూడా భారీ విజయం అందుకుంది. ఇక రాంచరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిరుత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రభాస్ తో బుజ్జిగాడు, మహేష్ బిజినెస్ మ్యాన్‌, ఎన్టీఆర్ టెంప‌ర్ వ‌ర‌కు పూరీ ప్ర‌భంజ‌నం కొనసాగిందని చెప్పాలి. ఆ త‌ర్వాత ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. ఇక గ‌త ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెర‌కెక్కించారు.

ఆ సినిమాతో ఇస్మార్ట్ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు పూరి. ఈ సినిమా దసరా కానుకగా  ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒక‌వైపు ద‌ర్శ‌కుడిగానే కాకుండా పూరీ క‌నెక్ట్స్ బేన‌ర్‌ని స్థాపించి మంచి సినిమాలు నిర్మిస్తున్నాడు పూరీ. ఈ సందర్భంగా క‌ర‌ణ్ జోహార్ పూరీ జ‌గ‌న్నాథ్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. క‌ర‌ణ్‌ జోహార్ ప్రస్తుతం ఫైట‌ర్ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇండస్ట్రీలోని ప్రముఖులు, అభిమానులు పూరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Tags:    

Similar News