అంతా తల్లకిందులైంది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా అయ్యింది. ఇది ఊహించనిది. ఆకస్మికంగా వైరస్ విజృంభణ తాలూకా పర్యవసానం. సినీపరిశ్రమల్ని గడగడలాడిస్తున్న మహమ్మారీ ప్రభావం అందరికంటే ముఖ్యంగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా కలలను దెబ్బ కొట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా అతడు పాన్ ఇండియా రేంజులో ఫైటర్ ని ప్లాన్ చేస్తే ప్లాన్ అంతా కొలాప్స్ అయ్యింది.
ఈ మూవీకోసం పూరి ఎంతో రిస్క్ చేశాడు. ముంబైలోనే కాపురం పెట్టాడు. తనతో పాటు విజయ్.. ఛార్మి తదితర బృందం ముంబైలోనే లాక్ అయిపోయారు చాలా కాలంగా. ఇక కొవిడ్ పాజిటివ్ కేసుల కారణంగా ముంబై తీవ్రంగా ప్రభావితం కావడంతో ఏం చేయాలో పాలుపోని సన్నివేశం ఎదురైంది. ఇలాంటి క్లిష్ఠ పరిస్థితుల్లో ఫైటర్ షూటింగ్ లొకేషన్ ను ముంబై నుండి హైదరాబాద్ కి తరలిస్తారని ఊహాగానాలు సాగాయి. కానీ మొండివాడైన పూరి మొదట్లో లొకేషన్ ను మార్చకూడదని ముంబైలో మాత్రమే షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
కానీ పరిస్థితులు అందుకు ఏమాత్రం సహకరించలేదు. ముంబై మెట్రో అంతకంతకు అల్లకల్లోలం అవుతోంది. కొవిడ కేసులు అసాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం... ఫైటర్` హిందీ ప్రెజెంటర్ కరణ్ జోహార్ తో హీరో విజయ్ దేవరకొండతో పలుమార్లు చర్చల అనంతరం షూటింగ్ ను హైదరాబాద్ కి మార్చాలని నిర్ణయించుకున్నారు. ముంబైలో నిర్మించిన సెట్ ని పూర్తిగా కూల్చివేసి... హైదరాబాద్ లో అలాంటిదే నిర్మించి షూటింగ్ చేస్తారట.
కిక్ బాక్సింగ్ బ్యాక్డ్రాప్ కథాంశంతో ఫైటర్ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం దేవరకొండ తన లుక్ ని కూడా మార్చుకున్నాడు. ఈ లాక్ డౌన్ లో భారీగా కండలు పెంచుతున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ - అనన్య బృందం కోసమే పూరి ముంబై బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడని... అక్కడే లొకేషన్లు సెట్ చేశాడని అప్పట్లో ముచ్చట సాగింది. కానీ ఇప్పుడు కొవిడ్ మొత్తం టీమ్ ని హైదరాబాద్ కే లాక్కొస్తోంది.