సెట్ లో అయినా, ఇంట్లో అయినా.. గౌరవం ఇవ్వాల్సిందే!
టాలీవుడ్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ, నటి వరలక్ష్మి శరత్కుమార్ తనదైన ముద్ర వేయాలని డైరెక్టర్ గా కొత్త అడుగు వేస్తున్నారు.;
టాలీవుడ్లో మహిళా డైరెక్టర్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ, నటి వరలక్ష్మి శరత్కుమార్ తనదైన ముద్ర వేయాలని డైరెక్టర్ గా కొత్త అడుగు వేస్తున్నారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన సరస్వతి సినిమా మార్చి 6న రిలీజ్ కావడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఈ చిత్ర ప్రమోషన్స్ లో వరూ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
ఆ సినిమా నుంచి తప్పుకున్నా!
అహం, ఆత్మగౌరవంలో తాను ఆత్మ గౌరవానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని, ఓ మలయాళ మూవీలో తనను తక్కువగా చూశారని ఆ సినిమా నుంచి తాను తప్పుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఆ సినిమా హీరో, డైరెక్టర్ మంచి వాళ్లైనప్పటికీ, నిర్మాత తనతో వ్యవహరించిన తీరు నచ్చకపోవడంతో, హీరోకు కాల్ చేసి ఈ సినిమాను చేయడం లేదని చెప్పానని, అది అహంభావం కాదని, ఆత్మ గౌరవమని ఆమె తెలిపారు.
అందరితో నిజాయితీగా ఉంటా!
తాను అందరితో నిజాయితీగా ఉంటానని, తాను అందరినీ గౌరవిస్తానని, తనను కూడా అందరూ గౌరవించాలని కోరుకుంటానని, సెట్ లో అయినా, ఇంట్లో అయినా ఎక్కడైనా గౌరవం ఇవ్వాల్సిందేనని, లేదంటే అస్సలు సహించనని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని తాను పెద్దగా పట్టించుకోనని చెప్తున్న ఆమె, సోషల్ మీడియాలో వచ్చిన ఓ వార్తను చూసి తాను తెగ నవ్వుకున్నానని తెలిపారు.
అదే ఉంటే ఇక్కడెందుకు ఉంటా?
తన పెళ్లికి రూ.800 కోట్లు ఖర్చైందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయని, అంత డబ్బే తన దగ్గరుంటే అసలు ఇక్కడ ఎందుకు ఉంటానని అడిగారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా గురించి కూడా ఆమె మాట్లాడారు. సోషల్ మీడియా కాలక్షేపానికి పనికొస్తుందని, దానిపై ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా, క్రియేటివ్ గా ఆలోచిస్తే, అది కెరీర్ కు ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు.
ఫహద్ ఫాసిల్, ఆలియా భట్, మంజు వారియర్, దీపికా పదుకొణె ను తానెంతో అభిమానిస్తానని చెప్తున్న వరలక్ష్మి, నాంది మూవీలో ఆద్య క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని, అది యాక్టింగ్ పరంగా చాలా గొప్ప పాత్ర అని చెప్పుకొచ్చారు. సరస్వతి సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని, ఈ సినిమా తీసినందుకు తనకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.