ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చరణ్‌ తో మైత్రి కుదిరేనా?

Update: 2020-08-05 06:00 GMT
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన సినిమా ఉంటుందని ఎన్టీఆర్‌ నుండే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక దర్శకుడు రాజమౌళి కూడా తదుపరి చిత్రం విషయంలో క్లారిటీగా ఉన్నాడు. మహేష్‌ బాబుతో సినిమా చేయాల్సి ఉందంటూ ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. అయితే రామ్‌ చరణ్‌ మాత్రం ఇప్పటి వరకు తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విన్న చరణ్‌ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఓకే చెప్పలేదని తెలుస్తోంది.

చరణ్‌ తదుపరి చిత్రం గురించి వారంకు ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా చరణ్‌ మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ తో సినిమా చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్రంను మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో చరణ్‌ చేశాడు. ఆ సినిమా సమయంలోనే మైత్రి మూవీస్‌ లో మళ్లీ సినిమా చేస్తానంటూ చరణ్‌ హామీ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడట. అంతా ఓకే అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్‌ లో నటించేందుకు అభ్యంతరం లేనట్లుగా చరణ్‌ ఉన్నాడట.

చరణ్‌ తో రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్‌ ను నిర్మించిన మైత్రి వారు ఈసారి చాలా విభిన్నమైన రీతిలో చరణ్‌ ను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఖైదీ విడుదలై సక్సెస్‌ అయిన సమయంలో ఆ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కు మైత్రి వారు అడ్వాన్స్‌ ఇచ్చారట. ప్రస్తుతం తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో సినిమాను చేస్తున్న లోకేష్‌ త్వరలోనే చరణ్‌ కు ఒక స్టోరీ వినిపించబోతున్నాడట. లోకేష్‌ వినిపించే ఆ కథ నచ్చితే ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత చరణ్‌ మైత్రి మూవీ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశం ఉందంటున్నారు. పూర్తి వివరాలు మరికొన్ని వారాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News