ప్ర‌సాద్ స్టూడియోస్ పై పంతం నెగ్గిన‌ ఇళ‌య‌రాజా

Update: 2020-12-23 07:30 GMT
ప్రసాద్ స్టూడియోస్ తీరును త‌ప్పు ప‌డుతూ మాస్ట్రో ఇళ‌యరాజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. స్టూడియోలోకి త‌న‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపైనా త‌న సామాన్లు విసిరేయ‌డంపైనా ఇళ‌య‌రాజా గుర్రుగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ వివాదంలో కోర్టులు ప‌రిష్కారం చూపించేందుకు చొర‌వ తీసుకున్నాయి.

మద్రాస్ హైకోర్టు చొర‌వ‌తో తాజాగా ప్ర‌సాద్ స్టూడియోస్ బృందాలు దిగొచ్చాయి. వారు కొన్ని ఆంక్షలతో మాస్ట్రోను తన గదికి అనుమతించేందుకు అంగీక‌రించారు. రాజా కోర్టు పోరాటంలో ఒక మెట్టు పైనున్నార‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. ల్యాబ్ పై త‌న‌కు యాజమాన్యపు హ‌క్కులేవీ లేవు.. కానీ త‌న గ‌దిలో ప‌ని చేసుకునే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని క్లెయిమ్ చేయడంతో దానిపై కోర్టు స‌ముచితంగా విచారించింది. త‌న‌ ఛాంబర్ లోపల తన ఆస్తులను యాక్సెస్ చేయడమే రాజా ఉద్దేశ్యం కావ‌డంతో పాజిటివ్ స్పంద‌న కోర్టు నుంచి వ్య‌క్త‌మైంది.

నిజానికి ఇంత‌కుముందు ప్ర‌సాద్స్ స్టూడియో నుంచి ఒక పత్రికా ప్రకటనను విడుదలైంది. ఇళ‌య‌రాజా ఉద్దేశ్యం సంగీత కూర్పున‌కు సంబంధించినది అయితే వారు ఆ గ‌దిలోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌రు. ఇప్పుడు కోర్టులో విచారణ తరువాత ప్రసాద్ స్టూడియో యాజమాన్యం అతనికి ప్రవేశం కల్పించడానికి అంగీకరించింది. అయితే రాజాపై కొన్ని ఆంక్షలను విధిస్తారని తెలిసింది.

గత ఏడాది డిసెంబర్ లో మద్రాస్ హైకోర్టు ఈ కేసులో రెండు పార్టీలకు మధ్యవర్తిత్వం వహించాలని సిఫారసు చేసింది. ల్యాబ్ ప్రాంగణాన్ని ఖాళీ చేయమని ఇళ‌యరాజను కోరినప్పుడు.. అదే ప్రాంగణంలో కొనసాగడానికి అనుమతించాలని కోరుతూ స్టూడియో యజమానులపై ఇళ‌య‌రాజా కేసు పెట్టారు. అయితే స్టూడియో యాజమాన్యం అతన్ని ఖాళీ చేయాలని కోరింది. ఇంతలో ఇలయరాజా తన సొంత రికార్డింగ్ స్టూడియోను తెరవడానికి సిద్ధంగా ఉన్నారని కొన్ని నెలల క్రితం వార్తా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అతను చెన్నై కోడంబకంలో ఒక థియేటర్ కొన్నారు. స్టూడియో నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అత్యాధునిక స్టూడియోని ఈ సెప్టెంబర్ లో ప్రారంభించాలని ఆయన ప్లాన్ చేసినా కుద‌ర‌లేదు. COVID 19 కారణంగా ఇది జరగలేదు.
Tags:    

Similar News