పవర్ స్టార్ ఓకే చేస్తున్న సినిమాల వెనుక అసలు రహస్యం ఇదే...!

Update: 2020-10-20 12:10 GMT
'రెండు పడవల మీద ప్రయాణం సజావుగా సాగదు' అనే నానుడి ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలతో బిజీగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇదివరకు రెండిటినీ బ్యాలన్స్ చేయడం కష్టమని భావించిన పవన్.. రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయంగా బిజీ అయ్యాడు. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత నా పూర్తి జీవితం ప్రజాసేవకే అని ప్రకటించి గత ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే పాలిటిక్స్ లో సరైన స్థానం దొరక్కపోవడంతో పవన్ ఆర్థికంగా బలపడాలని నిర్ణయించుకున్నాడు. రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే ఆలస్యం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే 'వకీల్ సాబ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అలానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. హరీష్ శంకర్ తో ఓ సినిమా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఓ ప్రాజెక్ట్ చేయడానికి పవన్ ఒప్పుకున్నాడు.

సార్వత్రిక ఎన్నికల కంటే ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడైన పవన్ కళ్యాణ్.. చాలా ఆలోచించే ఈ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేం. అప్రమత్తంగా ఉండకపోతే ఎన్నికలలో ఏదొక విధంగా ప్రభావం పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్.. సినిమాల స్టోరీ కంటే నిర్మాతల విషయంలో బాగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు తనతో సన్నిహితంగా ఉండే వారితో.. ముందు నుంచి తనతో ట్రావెల్ అవుతున్న వారితో మాత్రమే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నపుడు పరిస్థితులను బట్టి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి రావచ్చు. తనతో క్లోజ్ గా ఉండేవారితో అయితే ఆ విషయంలో ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. పవన్ ఇవన్నీ ఆలోచించుకునే ముందుగా తనతో సినిమా చేయడానికి పదేళ్ల నుంచి ట్రై చేస్తున్న దిల్ రాజుకు అవకాశం ఇచ్చాడు. అలానే క్రిష్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న సూర్య మూవీస్ ఏఎమ్ రత్నంతో పవన్ కు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది. హరీష్ శంకర్ - మైత్రీ మూవీస్ వారు పవన్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని నిర్మించనున్న రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ స్నేహితుడనే విషయం తెలిసిందే. పవర్ స్టార్ కి నేను ఫ్యాన్ ని కాదు భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేష్ తో సినిమా అంగీకరించడానికి కూడా అతనితో ఉన్న సాన్నిహిత్యమే కారణం. ఇలా పవన్ తనకు సహకరించే నిర్మాతలతో వచ్చే ఎన్నికల కంటే ముందే వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News