హీరోయిన్ ఇంట్లో చోరీ .. దొంగపై కోపం లేదట!

Update: 2022-01-20 03:17 GMT
నిక్కీ గల్రాని పేరు .. ఫేసు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అయితే తెలుగులో ఆమె చేసింది రెండు సినిమాలు మాత్రమే. ఆ సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఆడటం వలన, ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె ఇతర భాషలపై దృష్టి పెట్టింది. తమిళ .. మలయాళ .. కన్నడలో ఆమె కొంత క్రేజ్ ను సంపాదించుకోగలిగింది. ఈ భాషలకి చెందిన ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చెన్నైలోని 'రాయపేట'లో నివాసం ఉంటున్నారు. రీసెంట్ గా ఆమె ఇంట్లో చోరీ జరిగింది. నిక్కీకి సంధించిన ఖరీదైన వస్తువులు పోయాయి.

అయితే ఆమె ఇంట్లో ధనుశ్ అనే కుర్రాడు కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఆమె ఇంట్లో చోరీ జరిగిన దగ్గర నుంచి అతను పనిలోకి రావడం మానేశాడు. అసలు కనిపించకుండా పోయాడు. దాంతో నిక్కీ పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఖరీదు దాదాపు లక్ష రూపాయలు ఉంటుందనీ, తన ఇంట్లో పనిచేసిన ధనుశ్ అనే కుర్రాడిపైనే అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. ఇక మరో వైపున తమ కుమారుడు ధనుశ్ కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు నిక్కీ ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ధనుశ్ దొంగతనం చేసినట్టుగా తేలిపోయింది. దాంతో ధనుశ్ కోసం గాలించడం మొదలుపెట్టిన పోలీసులు 'తిరువూర్'లో ఒక స్నేహితుడి ఇంట్లో దాక్కున్న అతనిని పట్టుకున్నారు. అతను దొంగతనం చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ వస్తువులను నిక్కీకి అప్పగించారు. తన వస్తువులు తనకి దొరికాయి కనుక ధనుశ్ ను వదిలేయమని నిక్కీ కోరిందట. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనీ .. అతనిపై తనకి ఎలాంటి కోపం లేదంటూ ఫిర్యాదును ఉపసంహరించుకుందట.    
Tags:    

Similar News