బాలకృష్ణ సార్ ను చూస్తే నాకు బాధగా ఉంది: కంగనా

Update: 2019-02-25 14:57 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి దర్శకుడు క్రిష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  ఇప్పటికే 'మణికర్ణిక' సినిమా టైటిల్ క్రెడిట్స్ వివాదంలో ఇద్దరి మధ్య మాటల  యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ పై కంగనాను స్పందించమని విలేఖరులు కోరినప్పుడు క్రిష్ పై దుమ్మెత్తిపోసింది.

"ఎన్టీఆర్ బయోపిక్ కు పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదని.. హీరో కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిందని నేను పేపర్లలో చదివాను.  క్రిష్ ను నమ్మి ఆ ప్రాజెక్టుపై ఎంతో డబ్బు పెట్టిన బాలకృష్ణ సార్ ను చూస్తే నాకు బాధగా ఉంది.  'మణికర్ణిక' ప్రాజెక్ట్ ఇబ్బందిలో పడినప్పుడు బాధ్యత స్వీకరించి మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి.. కమర్షియల్ హిట్ చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సాధించేలా చేసిన నాపై గద్దల లాగా దాడి చేసి రక్తం తాగేందుకు ప్రయత్నించారు కాబట్టి వాళ్ళను నేను ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది.  ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే క్రిష్.. తనతో పాటు పెయిడ్ మీడియా ఒక యోధురాలి బయోపిక్ ను దెబ్బ తీసేందుకు క్యాంపెయిన్ రన్ చేశారు.  నిజానికి ఇలాంటి కృతజ్ఞత లేని ఫూల్స్ కోసం మన ఫ్రీడమ్ ఫైటర్లు తమ రక్తాన్ని ధారపోశారని తలుచుకుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది." అంటూ ఎడాపెడా వాయించిపారేసింది

'మణికర్ణిక' సినిమాను పూర్తి చేసిన తర్వాత తప్పుకున్నానని క్రిష్ అంటూ ఉంటే.. అసలు సినిమా నావల్లే పూర్తయిందని క్రెడిట్ నాదేనని కంగనా అంటోంది.  ఈ హంగామానే ఇంకా చల్లారలేదని జనాలు అనుకుంటూ ఉంటే ఇప్పుడు క్రిష్.. ను ఓ సెక్షన్ మీడియాను రాబందులని.. ఫూల్స్ అని విమర్శలు చేయడం వివాదాన్ని మరింతగా పెంచేదిగా ఉంది.  మరి ఈ విషయం పై క్రిష్ ఏ రకంగా స్పందిస్తాడో వేచి చూడాలి.
 
Tags:    

Similar News