అలా రాయాలి..ఇలా తీయాలి అంటున్న కొరటాల

Update: 2017-01-24 07:39 GMT
ప్రస్తుతం టాలీవుడ్లో రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. ఈ జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అంతటి పేరు సంపాదించాడు కొరటాల శివ. ప్రస్తుతం టాలీవుడ్లో ఆయనకున్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఐతే తనకు మాత్రం రచయితగా.. దర్శకుడిగా రాజమౌళి కుటుంబమే స్ఫూర్తి అంటున్నాడు కొరటాల. రచయితగా తాను విజయేంద్ర ప్రసాద్ లాగా రాయాలనుకుంటానని.. దర్శకుడిగా రాజమౌళి లాగా తీయాలనుకుంటానని కొరటాల చెప్పాడు.

విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవల్లి’ ఆడియో వేడుకలో కొరటాల మాట్లాడుతూ.. ‘‘నాకు రాజమౌళి కుటుంబాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దేశంలో సినిమా మీద ఇంత ప్యాషన్ ఉన్న ఫ్యామిలీ ఇంకొకటి ఉండదేమో. మిర్చి సినిమా తీసేటపుడు ప్రభాస్ కూడా చెప్పాడు. వాళ్లకు సినిమా తప్ప మరో లోకం ఉండదని. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారని. అందుకే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా వాళ్లలా ఉండాలనుకుంటాను కానీ కుదరదు. విజయేంద్ర ప్రసాద్ మా అందరికీ ఆదర్శం. బొబ్బిలి సింహం రోజుల్లోనే ఆయన్ని చూసి స్ఫూర్తి పొందాం. ఐతే రచయితలు కొంచెం వయసు మళ్లాక జోరు తగ్గిస్తుంటారు. కానీ ఆయన అలా కాదు. ఇప్పుడు కూడా అద్భుతమైన కథలు రాస్తూ మా అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. నేను రచయితగా ఆయన లాగా భారీ కథలు రాయాలనుకుంటాను. అలాగే రాజమౌళిలో భారీ కాన్వాస్ లో సినిమాలు తీయాలనుకుంటాను. ‘శ్రీవల్లీ’ సినిమాతో విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా తన కొడుకును సవాల్ చేస్తాడని ఆశిస్తున్నా’’ అని కొరటాల చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News