ఆడాళ్లూ మీకు జోహార్లు.. ఆగిపోలేదట

Update: 2017-10-21 01:30 GMT
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా గత ఏడాది ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల చేయాల్సిన సినిమా ఇది. ప్రి ప్రొడక్షన్ పూర్తయి ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకుంటుండగా.. అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది. కారణాలేంటో తెలియలేదు. వెంకీ.. ‘ఇరుదు సుట్రు’ రీమేక్ ‘గురు’ చేశాడు. కిషోర్ మళ్లీ రామ్ హీరోగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా  తీశాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమా గురించి ప్రస్తావిస్తే స్పందించాడు కిషోర్.

భవిష్యత్తులో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాను వెంకీనే హీరోగా చేసే అవకాశాలున్నాయని కిషోర్ తెలిపాడు. ఆ సినిమా తాత్కాలికంగా ఆగిందని.. పూర్తిగా ఆగలేదని కిషోర్ తెలిపాడు. ఆ కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం వల్లే సినిమా చేయలేదన్నాడు కిషోర్. ఆ కథ తనకే పూర్తి సంతృప్తినివ్వకపోవడంతోనే వెనక్కి తగ్గామన్నాడు. ఆ కథ మీద మళ్లీ వర్క్ చేసి తాను ఆ సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ కథ విషయంలో వెంకీకి తనకు విభేదాలు వచ్చినట్లు వచ్చిన ఆరోపణల్ని కిషోర్ ఖండించాడు. వెంకీతో తనకు మంచి సంబంధాలున్నాయని.. ఇటీవల ‘ఉన్నది ఒకటే జిందగీ’లోని వాట్ అమ్మా సాంగ్ హిట్టయినపుడు తనకు ఫోన్ చేసి కూడా అభినందించాడని తెలిపాడు. తన తర్వాతి సినిమా నానితో ఉండొచ్చని.. అలాగే నితిన్ తో కూడా తనకు ఓ కమిట్మెంట్ ఉందని చెప్పాడు కిషోర్.
Tags:    

Similar News