శాతకర్ణి గురించి ఆమె ఎగ్జైట్ అయిపోయింది

Update: 2016-08-29 09:52 GMT
గౌతమీపుత్ర శాతకర్ణి కొత్త షెడ్యూల్ ఈ రోజే ఆరంభమవుతోంది. ఈ షెడ్యూల్లోనే అలనాటి బాలీవుడ్ తార హేమమాలిని ‘శాతకర్ణి’ సెట్లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమమాలిని చాలా ఎగ్జైట్ అయిపోయింది. ఇలాంటి సినిమాలో తాను నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందంటూ ఆమె ట్వీట్లు చేసింది.

‘‘తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ‘గౌతమి’గా నటిస్తుండటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇది శాతవాహనుల పాలన నేపథ్యంలో సాగే సినిమా. తొలి శతాబ్దంలో ఇండియా మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఆంధ్రా (ప్రస్తుతం తెలంగాణ) రాజు శాతకర్ణి గురించి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన తల్లి స్ఫూర్తితోనే శాతకర్ణి ఇదంతా సాధించినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి తల్లి పాత్రలో నేను కనిపించబోతున్నాను’’ అని హేమమాలిని ట్విట్టర్లో పేర్కొంది.

ఇక ఈ సినిమాలో హేమమాలినితో పాటు హాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపున్న బాలీవుడ్ నటుడు కబీర్ బేడి విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. బాలయ్య సరసన శ్రియ కథానాయికగా నటిస్తుండగా.. ఆయన తనయుడు నందమూరి మోక్షజ్న కూడా ఓ చిన్న పాత్రలో తళుక్కుమంటాడని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు క్రిష్.
Tags:    

Similar News