అవిక స్టోరీ ఇంకా పూర్తి అవ్వలేదు

Update: 2020-12-23 03:11 GMT
తెలుగు ప్రేక్షకులకు అవికా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ నుండే తెలుసు. ఆమె చిన్న పిల్లగా ఎంతో మందిని మెప్పించింది. ఉయ్యాల జంపాల సినిమాలో అవికా హీరోయిన్ గా నటించడం చూసి అరే అప్పుడే ఈ అమ్మాయి ఇంత పెద్దగా అయ్యిందా అనుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఉయ్యాల జంపాల సినిమా తర్వాత అవికా బిజీ హీరోయిన్‌ గా మారుతుందని అంతా భావించారు. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కాని ఎక్కువ శాతం నిరాశ పర్చాయి. దాంతో ఆమె కెరీర్‌ డోలాయమానంలో పడ్డట్లయ్యింది. ఆ సమయంలోనే బరువు పెరగడంతో అస్సలు ఆమెను మేకర్స్‌ పట్టించుకోలేదు. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి బరువు తగ్గిన అవికాకు రాజు గారి గది సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చడంతో ఇక అవిక గౌర్‌ స్టోరీ పూర్తి అయ్యిందని.. ఆమె టాలీవుడ్‌ లో కనిపించక పోవచ్చు అనుకున్నారు. కాని అనూహ్యంగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది.

టాలీవుడ్‌ లో ఆఫర్లపై ఆశ వదిలేసుకుని ఉత్తరాదిన సీరియల్స్‌ చిన్న సినిమాల కోసం ప్రయత్నాలు చేయడంతో పాటు తన ప్రియుడిని పరిచయం చేసేసి పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా హింట్ ఇచ్చిన అవికా గౌర్‌ కు అనూహ్యంగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'థ్యాంక్యూ' సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ లో ఒక హీరోయిన్‌ గా నటించే అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రియాంక అరుల్‌ మోహన్ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్ లు హీరోయిన్స్‌ గా ఎంపిక అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మూడవ హీరోయిన్ గా అవికా గౌర్‌ ను ఎంపిక చేశారని మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన థ్యాంక్యూ సినిమా షూటింగ్‌ లో అవికా త్వరలో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమాతో అయిన అవిక మళ్లీ బిజీ అయ్యేనా అనేది చూడాలి.
Tags:    

Similar News