ఒక్క క్యాండిల్‌ అయినా చాలు - బన్నీ

Update: 2015-12-07 12:20 GMT
చెన్నైతో ఎంతో అనుబంధం ఉన్న టాలీవుడ్ నటులు.. ఇప్పుడా నగరానికి వచ్చిన కష్టానికి చలించిపోతున్నారు. ప్రకృతి సృష్టించిన ప్రళయ బీభత్సానికి తెలుగు నటుల హృదయాలు ద్రవించిపోతున్నాయి. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన బన్నీ.. సరైన సమయంలో సహాయం అందించడం ఇంకా ముఖ్యం అంటున్నాడు.

"సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న మేము, మాలోని మానవత్వాన్ని మరింతగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రజలందరూ చెన్నై కోసం ఎంతో కొంత విరాళం ఇవ్వాలని కోరుతున్నాను. ఈ సమయంలో పంపే ఓ కొవ్వొత్తి కూడా అక్కడి బాధితులకు ఎంతో ఉపయోగపడుతుంది" అంటూ కన్నీటితో చెప్పాడు అల్లు అర్జున్. మన మద్రాస్ కోసం పేరుతో నిర్వహిస్తున్న నిధుల నిర్వహణ కార్యక్రమంలో బన్నీ తన హృదయాన్ని పంచుకున్నాడు. "నేను కొంత డబ్బు విరాళంగా ప్రకటించిన మాట వాస్తవమే. అయితే ఇది ప్రజలకు చేరేందుకు టైం పడుతుంది. అందుకే ఆహారపొట్లాలు - వాటర్ ప్యాకెట్స్ కొని - చెన్నైలోన బాధితులకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. దుప్పట్లు - మందులు కూడా ఇప్పుడు చెన్నై ప్రజలకు చాలా అవసరం " అన్నాడు బన్నీ.

నవదీప్ - మంచు లక్ష్మి - రాణాల ఆధ్వర్యంలో సెలబ్రిటీ గ్రూప్ కలిసి... 400 కుటుంబాలకు అవసరమైన పదార్ధాలను పంపిస్తున్నారు. ఇవి వారికి 10 రోజుల పాటు సరిపోతాయని అంచనా. ఇంతలా స్పందిస్తున్న వీరిని అల్లు అర్జున్ అభినందించాడు. వీరితో పాటు నరేష్ - నాని - మధుశాలిని కూడా ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
Tags:    

Similar News