బాలీవుడ్ కిలాడీ టాలీవుడ్ ఎంట్రీ?

Update: 2019-10-10 06:40 GMT
మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ .. పాన్ ఇండియా ట్రెండ్ .. ప్ర‌స్తుతం స్టార్ల ఆలోచ‌న‌ల్ని మార్చేస్తోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఏదో ఒక ప్రాంతానికే ప‌రిమితం అన్న ఆలోచ‌న కాకుండా ఉత్త‌రాది-ద‌క్షిణాదిని క‌లుపుకుంటూ దేశ‌మంతా ఒక్క‌టే సినిమా అని చాటే బిగ్ ప్లాన్ స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డుతోంది. కేవ‌లం హీరోలే కాదు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇదే కోరుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు ప్ర‌స్తుతం ద‌క్షిణాది వైపు చూస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. కిలాడీ అక్ష‌య్ కుమార్ మ‌రో మెట్టు ముందుకు వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది.

కిలాడీ అక్ష‌య్ కుమార్ గ‌తేడాది 2.0 చిత్రంతో  కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ప‌క్షిరాజు పాత్ర‌తో అక్కీ ఆక‌ట్టుకున్న వైనం సూప‌ర్బ్. హాలీవుడ్ న‌టుడు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గ‌ర్ క‌న్నా ఆ పాత్ర‌కు తానే ప‌ర్ పెక్ట్ గా సూట‌వుతాన‌ని నిరూపించాడు. ద‌ర్శ‌కుడు శంక‌ర్  కి  అనుకున్న దానిక‌న్నా బెట‌ర్‌ ఔట్ పుట్ ని ఇచ్చాడు.  బాక్సాఫీస్ ఫ‌లితాలు ఎలా ఉన్నా కిలాడీ త‌న పాత్ర‌కు మాత్రం  వంద‌కి రెండొద‌లు శాతం న్యాయం చేసాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాజాగా కిలాడీ క‌న్ను తెలుగు సినిమాల‌పైనా ప‌డింది. టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నాతో సినిమాలు చేయాలి కానీ... ఎంట్రీ ఇవ్వ‌డానికి నేను సిద్దం అంటూ ముందుకొచ్చాడు.

ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన హౌస్ ఫుల్ -4 అక్టోబ‌ర్ లో  రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా టీమ్ అంతా హైద‌రాబాద్ లో ప్ర‌చారం సాగించింది. ఈ నేప‌థ్యంలో అక్ష‌య్ తెలుగు సినిమాల‌పై త‌న ఆస‌క్తిని వెల్ల‌డించాడు. తెలుగు మాట్లాడ‌టం.. రాయ‌డం రాక‌పోయినా సినిమాల‌ను మాత్రం ప్రేమిస్తాను. భాష‌ను నేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తానన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ బాలీవుడ్ హీరో మ‌న‌ల్ని ఉద్దేశించి ఇలా మాట్లాడింది  లేదు. తెలుగు సినిమాల‌ను బాలీవుడ్ లో  రీమేక్ చేసే ఆలోచ‌న త‌ప్ప‌.. నేరుగా తెలుగు సినిమాలో న‌టిస్తాన‌ని ఏ హీరో  బాహాటంగా ప్ర‌క‌టించలేదు. అలాగే గ‌తంలో  ప్రియ‌ద‌ర్శ‌న్- మురుగ‌దాస్ వంటి ద‌క్షిణాది ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన అనుభ‌వం  అక్ష‌య్ కుమార్ సొంతం. అందుకే ఆయ‌న ఇలా అభిమానం చూపిస్తున్నార‌న్న‌మాట‌. ఒక‌వేళ కిలాడీ ఎంట్రీకి 2.0 సీక్వెల్ రేంజు స్క్రిప్టును రెడీ చేయాల్సి ఉంటుందేమో!
Tags:    

Similar News