లెజెండ్ ANR క్ర‌మ‌శిక్ష‌ణ క‌సి‌ అఖిల్ లో ఉన్నాయా?

Update: 2020-09-20 06:45 GMT
లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు ప్ర‌త్యేక‌త గురించి ఎన్న‌ని చెప్పాలి. ఆయ‌నో న‌ట శిఖ‌రం మాత్ర‌మే కాదు గొప్ప ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన జీవితానికి బ్రాండ్ అంబాసిడ‌ర్. క్ర‌మ‌శిక్ష‌ణ క‌ఠోర సాధ‌న అనిత‌ర సాధ్య‌మైన పోరాట ప‌టిమ ధైర్యం ఇలా ఎన్నో గొప్ప ల‌క్ష‌ణాలు ఆయ‌న సొంతం అని త‌న‌ని ద‌గ్గ‌ర‌గా చూసిన స‌న్నిహితులు కితాబిస్తుంటారు. నీతి నియ‌మాల‌తో బ‌తుకు వెల్ల‌దీసిన గొప్ప విజ్ఞాని ఆయ‌న‌. మాన‌సిక ప‌రివ‌ర్త‌నలో ఆయ‌న ఎవ‌రూ అందుకోలేని శిఖ‌రం.

స‌రిగ్గా అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం` రిలీజ్ స‌మ‌యంలోనే ఆయ‌న త‌న‌కు క్యాన్స‌ర్ ఉంద‌ని ఎంతో కాలం బ‌త‌క‌ను అని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పిన‌ప్పుడు ఔరా! అంటూ మీడియా వాళ్లే ముక్కున వేలేసుకున్నారు. అంత తెలిసీ ఆయ‌న ధైర్యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌ర‌ణం అని తెలిసీ మీటింగు పెట్టారు పెద్దాయ‌న‌! అంటూ ఆ ధైర్యానికి కించిత్ గ‌ర్వించాల‌ని కామెంట్లు చేసిన‌వారు ఉన్నారు. స్వ‌త‌హా నాస్తికుడు అయిన ఆయ‌న స్వ‌ర్గం న‌ర‌కం గురించి మాట్లాడ‌రు. చివ‌రి నిమిషంలోనూ సినిమాల గురించే మాట్లాడారు.

అదంతా స‌రే కానీ మ‌న‌వ‌ళ్ల‌తో అక్కినేని అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. తాను ఎంతో గొప్ప‌గా అభిమానించే చిన్న మ‌న‌వ‌డు అఖిల్ `మ‌నం`లో అక్కినేనితో స్క్రీన్ చేసుకోవ‌డం అదృష్టం అనే చెప్పాలి. అందుకే అక్కినేని  97 వ జయంతి సంద‌ర్భంగా అఖిల్ ఎంతో ఎమోష‌న్ అవుతున్నారు. ఈ సందర్భంగా, అఖిల్ అక్కినేని న‌టించ‌నున్న ఐద‌వ‌ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ప్రతి అక్కినేని అభిమానుల హృదయాన్ని తాకేలా ప్రత్యేక నివాళి వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో అఖిల్ త‌న తాత‌గారి బ‌లాల‌ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులే చెప్పాడు. అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ `మనం`లో తన తాతతో స్క్రీన్ ని షేర్ చేసుకున్న అనుభవం గురించి అఖిల్ చేసిన ప్రసంగం ఆక‌ట్టుకుంది. ఎంతో గొప్ప‌ నాస్తికుడైన ANR తన అభిమానులను మాత్రం దేవతల్లా చూసుకున్నార‌న్న‌ది అవ‌గ‌త‌మైన విష‌య‌మే.

అఖిల్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా(అఖిల్ 5)కి సంబంధించి వారం క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్  - సురేంద‌ర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్నాయి. ఇదో యాక్ష‌న్ క‌థాంశం కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే దాదాపు 45 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News