ఇండియాలో ప్రభాస్‌ తర్వాతే మరెవ్వరైనా..!

Update: 2020-08-19 11:50 GMT
బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. బాహుబలి 2 చిత్రం బాలీవుడ్‌ సినిమాల వసూళ్లను తలదన్నేలా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికి కూడా బాహుబలి 2 రికార్డులు అలాగే ఉన్నాయి. బాహుబలి తర్వాత సాహో సినిమాతో మళ్లీ బాలీవుడ్‌ లో దుమ్ము రేపాడు. ఒక యావరేజ్‌ మూవీ ఆ స్థాయిలో వసూళ్లను రాబట్టడం ఏంటంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఆ రెండు సినిమాలతో ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న మూడు సినిమాలు ఆయన్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడం ఖాయంగా కనిపిస్తున్నాయి.

మొదటగా రాధేశ్యామ్‌ చిత్రంతో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌ తో రాధేశ్యామ్‌ రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ చిత్రం తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని ప్రభాస్‌ చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసిన నాగ్‌ అశ్విన్‌ షూటింగ్‌ మొదలు పెట్టేందుకు వెయిట్‌ చేస్తున్నాడు. ఈ సమయంలోనే బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు ఓం రౌత్‌ తో ప్రభాస్‌ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

భారీ బడ్జెట్‌ తో ప్రభాస్‌ ఓం రౌత్‌  కాంబో మూవీ ఆదిపురుష్‌ ను టీసీరిస్‌ నిర్మించబోతుంది. నాగ్‌ అశ్విన్‌ ఇంకా ఓం రౌత్‌ ల సినిమాలు దాదాపుగా 650 కోట్ల నుండి 750 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అంటే ప్రభాస్‌ మూడు సినిమాలు కలిపి వెయ్యి కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ స్టార్‌ సూపర్‌ స్టార్‌ ఈ స్థాయి బడ్జెట్‌ లతో సినిమాలు చేయలేదు. ఒకేసారి వెయ్యి కోట్ల సినిమాలు చేస్తున్న ఘనత ప్రభాస్‌ కు మాత్రమే దక్కింది.

రాబోయే పది పదిహేను ఏళ్ల వరకు కూడా ప్రభాస్‌ ఈ రికార్డును పదిలంగా తనపేరుతోనే ఉంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకేసారి మూడు సినిమాలు అది కూడా అంత భారీ బడ్జెట్‌ సినిమాలు ఏ స్టార్‌ హీరో కూడా చేయలేక పోవచ్చు. కనుక ఏ హీరో అయినా ప్రభాస్‌ తర్వాతే అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో గొప్పగా ప్రచారం చేస్తున్నారు.
Tags:    

Similar News