జెన్‌జెడ్‌ జంటల కొత్త హనీమూన్‌ ట్రెండ్‌: యూరప్‌ వదిలేసి ఆసియా వైపు పయనం!

హనీమూన్‌కు జంటలు వెనకాడకుండా ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా జంటలు రూ.1–2 లక్షల మధ్య ఖర్చు చేస్తున్నా, క్యూసరేట్‌ చేసిన లగ్జరీ ట్రిప్‌లకు వెళ్లేవారు రూ.3–4 లక్షల వరకూ వెచ్చిస్తున్నారు.;

Update: 2025-10-29 20:30 GMT

కొత్త తరం పెళ్లి జంటలు తమ హనీమూన్‌ ప్లానింగ్‌లో సంప్రదాయాలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు కొత్త జంటల కలల గమ్యస్థానాలుగా నిలిచిన యూరప్‌ పర్వతాలు, స్విట్జర్లాండ్‌ మంచు చలెట్స్‌ స్థానంలో ఇప్పుడు బాలీ తీరాలు, వియత్నాం వీధులు, దుబాయ్‌ లగ్జరీ స్కైలైన్‌లు నిలుస్తున్నాయి.

ఈ తరం జంటలు కేవలం విహారం కోసం కాకుండా, తమ పర్యటనలో ఒక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కథను, ప్రత్యేకమైన అనుభూతిని కోరుకుంటున్నారు. ఇది హనీమూన్‌ నిర్వచనాన్ని తిరగరాస్తోంది.

* ఎక్కడికి వెళ్తున్నారు జెన్‌జెడ్‌ జంటలు?

తాజా సర్వేల ప్రకారం, భారతీయ జెన్‌జెడ్‌ (Gen Z) ప్రయాణికుల్లో 62% మంది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే "అనుభవాత్మక" ట్రిప్‌లను కోరుకుంటున్నారు. దీనికి విరుద్ధంగా మిల్లెనియల్స్‌లో కేవలం 38% మంది మాత్రమే సౌకర్యం, పరిచయమున్న గమ్యస్థానాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ మార్పు కారణంగా, వియత్నాం, దుబాయ్, బాలీ వంటి దేశాలు 2025లో 'హాట్‌ డెస్టినేషన్స్‌'గా ఎదిగాయి. మాల్దీవులు, థాయ్‌లాండ్‌, యూరప్‌ వంటివి ఇంకా హిట్‌ గమ్యస్థానాలుగానే ఉన్నప్పటికీ కొత్తగా ఈ జాబితాలో చేరిన వియత్నాం ఆకర్షణకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. తక్కువ ఖర్చు , సాంస్కృతిక వైవిధ్యం , అడ్వెంచర్‌ కలయికగా ఈ టూర్లు ఉండడంతో అటు వెల్లేందుకు ఇష్టపడుతున్నారు. .

వియత్నాంలోని హా లాంగ్‌ బేలో రొమాంటిక్‌ క్రూయిజ్‌లు, హోయ్‌ ఆన్‌లో దీపాల కాంతిలో విందులు జంటలకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తున్నాయి. మరోవైపు, దుబాయ్‌ను ఎంచుకుంటున్న జంటలు లగ్జరీ , గ్లామర్‌ను కోరుకుంటున్నారు. రూఫ్‌టాప్‌ డిన్నర్లు, డెజర్ట్‌ సఫారీలు, యాచ్‌ డేట్స్‌ ఇప్పుడు కొత్త హనీమూన్‌ ట్రెండ్స్‌గా మారాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ నగరాల యువజంటలు ఈ కొత్త ట్రెండ్‌కి నాయకత్వం వహిస్తున్నారు.

* ఖర్చులో పెరుగుదల: భావోద్వేగ పెట్టుబడి

హనీమూన్‌కు జంటలు వెనకాడకుండా ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా జంటలు రూ.1–2 లక్షల మధ్య ఖర్చు చేస్తున్నా, క్యూసరేట్‌ చేసిన లగ్జరీ ట్రిప్‌లకు వెళ్లేవారు రూ.3–4 లక్షల వరకూ వెచ్చిస్తున్నారు. ప్రతీ ఏడాది సగటున 5% మేర ఖర్చు పెరుగుతోంది. ఇది ట్రావెల్‌ను కేవలం విహారంగా కాకుండా ఒక భావోద్వేగ పెట్టుబడిగా ఈ తరం భావిస్తున్నారనడానికి నిదర్శనం.

* అనుభవాలకే ప్రాధాన్యం, లగ్జరీ కాదు

మునుపటి తరాలు ఐదు స్టార్‌ రిసార్ట్‌లలో సౌకర్యాన్ని కోరుకునేవారు. కానీ జెన్‌జెడ్‌ తరం మాత్రం ఖరీదైన సౌకర్యాల కంటే వాస్తవ అనుభూతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

రొమాన్స్‌కు కొత్త నిర్వచనాలు ఇవీ..

బాలీలో కుకింగ్‌ క్లాసులు, వియత్నాంలో జంటగా రింగ్‌ మేకింగ్‌ వర్క్‌షాపులు,

థాయ్‌లాండ్‌లో వెల్‌నెస్‌ రిట్రీట్స్‌ కు ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈ జంటలకు ట్రిప్‌ అంటే దాని ఖరీదు కాదు, ఆ అనుభూతిని పంచుకోవడం. బాలీ తీరాల సూర్యాస్తమయం నుంచి హనోయ్‌ నైట్‌ మార్కెట్‌ల వరకూ జెన్‌జెడ్‌ భారతీయ జంటల హనీమూన్‌లు ఇప్పుడు కేవలం వాస్తవాన్ని తప్పించుకోవడమే కాకుండా దాన్ని కలిసి అన్వేషించే ప్రయాణంగా మారాయి.

మొత్తానికి, ప్రేమను "లగ్జరీ"గా కాకుండా "అనుభవం"గా చూసే తరం వచ్చేసింది. అందుకోసమే వారు స్విట్జర్లాండ్‌ మంచును వదిలేసి, ఆసియా దేశాల దీపాలను ఎంచుకుంటున్నారు.

Tags:    

Similar News