ఎకరా రూ.237 కోట్లకు కొనేసి గౌర వెంచర్స్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ఇంత భారీ ధరకు భూమిని సొంతం చేసుకున్న సంస్థ ఎవరన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఖరీదైన భూమిని సొంతం చేసుకుంది.
ఎకరం రూ.237 కోట్లు. అది కూడా ఒకట్రెండు కాదు ఏకంగా 6.29 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వంలోని టీజీఐఐసీ సంస్థ వేలం వేయటం.. దీన్ని రికార్డు ధరకు సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇంత భారీ ధరకు భూమిని సొంతం చేసుకున్న సంస్థ ఎవరన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఖరీదైన భూమిని సొంతం చేసుకుంది. దీని ఎండీగా ఆదిత్య గౌరాగా చెప్పాలి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు కం ఎండీగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు గౌరా శ్రీనివాస్.. గౌరా నాగార్జున్ లాంటి వారు ఈ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ లో ఈసంస్థ సుదీర్ఘకాలంగా రియల్ ఎస్టేట్ తో పాటు.. పలు వ్యాపారాల్ని నిర్వహిస్తున్నాయి. దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న గ్రోవ్ గౌరా గ్రూప్ కు వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రూప్ నకు రియల్ ఎస్టేట్..ఫార్మా.. పెట్రో కెమికల్స్.. ఐటీ.. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఉన్నట్లుగా వ్యాపార వర్గాలు చెబుతుంటాయి. తాజాగా భూవేలంలో రికార్డు స్థాయిలో ధరను బిడ్ చేసి.. భూమిని సొంతం చేసుకున్న గౌరా వెంచర్స్ విషయానికి వస్తే ఈ సంస్థను అధికారికంగా 2006 జనవరి 25న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేశారు. ఆదిత్య గౌరా విసయానికి వస్తే ఆయనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెబుతారు. అంతేకాదు.. హైదరాబాద్ క్రెడాయ్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన సుపరిచితులు. వీరి సంస్థ హైదరాబాద్ లోని నివాస.. వాణిజ్య రంగాల్లో పలు లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించిన హిస్టరీ వీరి సొంతం. రాయదుర్గం ఐటీ హబ్ లో ఉన్న అత్యాధునిక కమర్షియల్ ఆఫీస్ స్పేస్ గౌరా పల్లాడియం.. మాదాపూర్ లోని 13 అంతస్తుల్లో ఉన్న గౌరా ఫౌంటెన్ హెడ్.. కిస్మత్ పూర్ రోడ్డులో నిర్మించిన లగ్జరీ అపార్ట్ మెంట్ ప్రాజెక్టు గౌరా అర్బన్ విండ్స్.. మేడ్చల్ సమీపంలోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీగా పేరున్న గౌరా గ్రీన్ డేల్.. మాదాపూర్ లో నిర్మించిన గౌరా ట్యులిప్స్ లాంటి వెంచర్లు వీరికి చెందినవే.
వందల కోట్లతో భూమిని సొంతం చేసుకున్న గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వార్షిక టర్నోవర్ (ఆపరేటింగ్ రెవెన్యూ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.13 కోట్ల నుంచి రూ.29 కోట్ల మధ్యలో ఉన్నట్లుగా కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ సంస్థ నిర్మాణం చేసి అమ్మే కన్నా.. కమర్షియల్ ఐటీ స్పేస్ లను లీజుకు ఇవ్వటంపైనా.. రెంటల్ ఇన్ కం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్న మాట రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక.. ఆదిత్య గౌరా విషయానికి వస్తే.. ఆయన హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ముఫఖమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీర్ గా 1993-96 మధ్య బీటెక్ పూర్తి చేసినట్లు చెబుతారు. రియల్ ఎస్టేట్ వర్గాల్లో మ్యాన్ ఆఫ్ యాక్షన్ గా ఈయనకు పేరుంది.
దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న గౌరా గ్రూప్.. సంప్రదాయ విలువలను ఫాలో అవుతుందన్నది మార్కెట్ టాక్. ప్రాజెక్టులలో నాణ్యతతో పాటు.. కచ్ఛితమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారన్న పేరుంది. మార్కెట్ అనిశ్చితులకు లోను కాకుండా ఐటీ.. కార్పొరేట్ కంపెనీలకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే గ్రేడ్ ఏ కమర్షియల్ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తారన్న పేరుంది. తన ప్రతి ప్రాజెక్టును పక్కా వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తారని చెబుతారు.
ఇందుకు అదనంగా పర్యావరణ అనుకూల సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం ఆయనలోని మరో ఆసక్తికర కోణంగా చెబుతారు. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే..తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు వెల్లడించేందుకు ఆయనకు సుతారం ఇష్టం ఉండదని చెబుతారు. హైదరాబాద్ లోని టాప్ రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి.. ఆయనకంటూ ఉండే అత్యంత సన్నిహితుల వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారన్న పేరుంది. మొత్తంగా మార్కెట్ లో ఆయనకు నెగిటివ్ ఇమేజ్ లేదన్న అభిప్రాయాన్ని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.