వైసీపీదే ఫుల్ మెజార్టీ.. జగనే సీఎం

Update: 2016-11-06 06:33 GMT
ఇప్పటికప్పుడు ఏపీలో ఎన్నికలొస్తే... ? చంద్రబాబు పార్టీ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా.. లేదంటే మొన్నటి ఎన్నికల్లో త్రుటిలో పీఠం చేజార్చుకున్న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రవుతారా..? దీనికి వైసీపీ సమాధానం చెబుతోంది. అది కూడా ప్రజల నాడి పట్టుకుని చూసి మరీ లెక్కలు చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీకి 158 నుంచి 160 సీట్లు వస్తాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందని ఆయన వెల్లడించారు.

మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలకు కలిపి 45 శాతం ఓట్లు రాగానే ఒక్క వైసీపీకే 44 శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం టీడీపీ, దాని అనుబంధ పార్టీ ఓటు బ్యాంకు 45 శాతం నుంచి 15శాతానికి తగ్గిపోయిందని విజయసాయి విశ్లేషించారు. అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంకు 44 శాతం నుంచి మరింత పెరిగిందని ఆయన చెప్పారు. వైజాగ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి… రెండున్నరేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రయోజనాల కోసం పనిచేశామా? లేక స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశామా ? అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

జగన్‌ లక్ష కోట్లు అవినీతి చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారని… కానీ అందులో నిజం లేదని సీబీఐ చార్జిషీట్లే తేల్చాయన్నారు. జగన్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News