యోగీని చెప్పుల‌తో కొట్టండి

Update: 2018-04-16 06:14 GMT
కతువా - ఉన్నావ్ లైంగిక దాడి బాధితులకు న్యాయం జరుగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ - ముంబై, బెంగళూరు, గోవాతోపాటు కేరళ రాష్ట్రమంతటా ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్ - పంజాబ్ రాజధాని చండీగఢ్ - భోపాల్‌ లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల నిరసన కారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ - మానవ హారం నిర్మించారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరం సమీపాన సుమారు రెండు వేల మంది నిరసన ప్రదర్శన జరిపారు. మరోవైపు ముంబైలో బాలీవుడ్ సినీ నటి ప్రియాంక చోప్రా - నిర్మాత ఏక్తా కపూర్‌ తోపాటు పలువురు సినీ నటులు.. బాంద్రా ప్రాంతంలోని కార్టర్ రోడ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.

ఇదే స‌మ‌యంలో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ గుండూ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటకకు వచ్చినప్పుడు చెప్పులతో కొట్టాలన్నారు. ఉన్నావ్, కతువా లైంగికదాడి బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ `కర్ణాటకకు వచ్చి ప్రజలకు నీతులు చెబుతున్న యూపీ సీఎం యోగి ఓ వేషధారి.. అబద్ధాలకోరు.. ఆయన్ను అడుగుపెట్టనివ్వొద్దు. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్.. కాదు.. యోగి అని పలుకనవసరం లేదు. భోగి రాష్ట్రంలోకి వస్తే చెప్పులతో కొట్టి పంపండి` అని అన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ సీఎం ను కించపర్చడం తగదని పేర్కొంది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గుండూరావు స్పందిస్తూ ఏదో భావోద్వేగంతో మాట్లాడానని, ఆయన వస్తే చెప్పులు చూపాలని మాత్రమే అన్నానన్నారు.

Tags:    

Similar News