తెగ చూశారు: టాప్‌ 2లో మహిళల వరల్డ్‌ కప్‌..

Update: 2020-04-03 23:30 GMT
క్రికెట్‌ అంటే అందరికీ అమితాసక్తి. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడల్లో కన్నా క్రికెట్‌కు వీరాభిమానులు ఉన్నారు. అయితే వారంతా పురుషుల క్రికెట్‌కే ఉంటారు. కానీ మహిళల క్రికెట్‌కు అభిమానులు పెద్దగా ఉండరు. కానీ ఇప్పుడు ప్రజల ఆసక్తి మారిపోతుంది. పురుషులను ఆదరించినట్టే మహిళల క్రికెట్‌ను చూస్తున్నారు. అయితే స్టేడియాలకు రాకపోయినా టీవీలు, సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఇటీవల మహిళల క్రికెట్‌ టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ మహిళలు సత్తా చాటారు. వారు రికార్డులు నెలకొల్పారని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తెలిపింది. ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌ మార్చి 8వ తేదీన జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత్‌లో దాదాపు 90లక్షల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారంట. ఈ విషయాన్ని ఐసీసీ వెల్లడించింది.

ఈ సందర్భంగా ప్రపంచకప్‌ వీక్షించిన వారి వివరాలను గురువారం ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నమెంట్‌ మొత్తానికి భారత్‌లో దాదాపు 540 కోట్ల నిమిషాల వీక్షణలు వచ్చాయని వెల్లడించిం. ఎంత మంది, ఎన్ని మ్యాచ్‌లను ఎంత సమయం వీక్షించారనే విషయాలను గుణించి.. వీక్షణ నిమిషాలను లెక్కేసినట్టు ఐసీసీ తెలిపింది. 2018లో విండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి చూసినవారు 20 రెట్లు పెరిగారంట.

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8వ తేదీన జరిగిన టైటిల్‌ పోరును భారతదేశంలో టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి రికార్డు స్థాయిలో 90.2 లక్షల మంది వీక్షించారని ఐసీసీ లెక్కించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరయ్యారు. అయితే భారతదేశంలో ఈ మ్యాచ్‌ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించారు. భారత మహిళల క్రికెట్‌ జట్టు సత్తా చాటడంతో భారత్‌లో మొత్తంగా 540 కోట్ల నిమిషాల పాటు వీక్షించారు.

డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా 2019 పురుషుల ప్రపంచకప్‌ తర్వాత డిజిటల్‌ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా ఈ టోర్నీ నిలిచింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగిన టోర్నీ మ్యాచ్‌ల వీడియోలను వంద కోట్ల మందికి పైగా వీక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉండడంతో మహిళ క్రికెట్‌ ప్రపంచకప్‌ కు విశేష ఆదరణ లభించింది.

అయితే ఈ టోర్నీలో చివరకు భారత జట్టు ఓడిపోయింది. ఓటమి లేకుండా టోర్నమెంట్‌లో ఆడిన మహిళలు చివరకు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం భారతీయులను కలచి వేసింది. ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడి కప్‌ని చేజార్చుకోవడంతో వారు ఓడిపోయిన మనసులు గెలిచారని భారతీయులు వారికి అండగా నిలిచారు.

Tags:    

Similar News