ఒకే ఒక ఫోన్ కాల్ తో రూ. 77 లక్షలు గోవిందా ..!

Update: 2021-02-20 01:30 GMT
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు సైబర్ మోసగాళ్లు వారి పని వారు చేసుకుంటూపోతున్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా సైబర్ దొంగల చేతుల్లో మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఓ వ్యక్తి ఏకంగా 77 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. సిమ్ కార్డు బ్లాక్ అవుతుందంటూ మాయమాటలు చెప్పి, బ్యాంకు వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత క్షణాల్లోనే బ్యాంకులో ఉన్న సొమ్మునంతా లూఠీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే ..  ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కటక్ కు చెందిన సనతాన్ మొహంతి అనే వ్యక్తి సీనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఫిబ్రవరి 9వ తారీఖున ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ సిమ్ కార్డు బ్లాక్ అవబోతోంది. వెంటనే సిమ్ ను రీయాక్టివేట్ చేసుకోండి.

లేకుంటే ఈ నెంబర్ బ్లాక్ అయిపోయి ఫోన్ కాల్స్ రావు. ఈ నెంబర్ కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు చెబితే మేమే మీతో యాక్టివేట్ చేయిస్తాం అని సైబర్ చోరులు మాయమాటలు చెప్పారు. దీంతో మొహంతి ఆందోళన చెందాడు. వాళ్లు చెప్పినట్టే తన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్విక్ సపోర్ట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. దాని యాక్సెస్ ను సైబర్ చోరులకు ఇచ్చాడు.

ఆ తర్వాత తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా వివరాలను, ఏటీఎం కార్డు నెంబర్, సీవీవీ నెంబర్ తో సహా క్విక్ సపోర్ట్ యాప్ లో షేర్ చేశాడు. మీ సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుందని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మొహంతి పట్టించుకోవడం మానేశాడు. అదే రోజు సాయంత్రం ఏటీఎం లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు అతడికి మెసేజ్ వచ్చింది.

విషయం కనుక్కుందామని బ్యాంకుకు వెళ్తే ,మీ ఖాతాలో రెండు విడతలుగా 25వేల చొప్పున ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పారు. అవేం తాను చేయలేదనీ తన ఏటీఎం బ్లాక్ అయినట్టు మెసేజ్ వచ్చిందని చెప్పాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా బ్యాంకు సిబ్బంది తెలిపారు.

అదే సమయంలో బ్యాంకు అధికారులు కొత్త ఏటీఎం కార్డును ఇచ్చారు. 50 వేల రూపాయలు పోయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మొహంతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, ఏటీఎం కార్డును మార్చినా అతడి ఖాతాలోంచి డబ్బు మాయం అవడం ఆగలేదు. అయితే ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు తన ప్రమేయం లేకుండానే, తనకు తెలియకుండానే ఏకంగా 77 లక్షల 86 వేల 727 రూపాయలు బ్యాంకు ఖాతా నుంచి మాయం అయ్యాయి. తాను జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోయిందనీ, తనకు న్యాయం చేయాలని ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags:    

Similar News