తెలంగాణలో ‘ప్రాంతీయ’ ప్రస్థానం.. కేసీఆర్ వ్యూహాల ముందు కనుమరుగైన ఉద్దండులు..!

భావోద్వేగం వర్సెస్ అధికారం ఉద్యమ సమయంలో ఉన్న భావోద్వేగం, రాష్ట్రం వచ్చిన తర్వాత మారిన రాజకీయ అవసరాల మధ్య చాలా పార్టీలు నలిగిపోయాయి.;

Update: 2026-04-25 14:30 GMT

తెలంగాణ గడ్డపై మరో పార్టీ ఊపిరి పోసుకుంది. అదే కల్వకుంట్ల కవిత పెట్టిన టీఆర్ఎస్ (TRS-తెలంగాణ రాష్ట్ర సేన) ఈ రోజే పురుడు పోసుకున్న ఈ పార్టీ భవిష్యత్ లో ఎదుగుతుందా? లేక గతంలో ఉన్న పార్టీల మాదిరిగా దానిలోనే కలుస్తుందా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతోనో, లేదా కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగానో 'తెలంగాణ' పేరుతో పుట్టుకొచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి. కానీ, బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) సాధించిన స్థాయిలో విజయాన్ని మనుగడను ఏ పార్టీ సాధించలేకపోయింది. ఈ రాజకీయ వైఫల్యాల వెనుక ఉన్న కారణం ఏంటి? ఇప్పటికీ అంతుపట్టడం లేదు..

తెలంగాణ అంటే భావోద్వేగం. ఆ భావోద్వేగాన్ని ఓట్లుగా మార్చుకోవాలని దేవేందర్ గౌడ్ నుంచి షర్మిల వరకు ఎందరో ప్రయత్నించారు. కానీ, ప్రజల హృదయాల్లో ఒక పార్టీ ముద్ర వేయాలంటే కేవలం పేరులో ‘తెలంగాణ’ ఉంటే సరిపోదని, దానికి బలమైన కేడర్, ఆర్థిక వనరులు, సమయానుకూల వ్యూహాలు ఉండాలని చరిత్ర నిరూపించింది.

కేసీఆర్ ఆధిపత్యం

తెలంగాణ ఉద్యమం ఉదృతం చేయడం.. మొత్తం ఉద్యమాన్ని తన వైపునకు తిప్పుకోవడంలో కేసీఆర్ సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు. తెలంగాణ అనగానే కేసీఆర్ అనే ముద్ర ప్రజల్లో బలంగా పాతుకుపోయేలా చేశాడు. ఆలె నరేంద్ర లేదంటే విజయశాంతి వంటి వారు తెలంగాణ కోసం పార్టీలు పెట్టినా, వారు టీఆర్ఎస్ నుంచి విడిపోయి వచ్చిన వారు కావడంతో ప్రజలు వారిని ‘ప్రత్యామ్నాయం’గా చూడలేకపోయారు.

దేవేందర్ గౌడ్ (నవ తెలంగాణ), విజయశాంతి (తల్లి తెలంగాణ), ఆలె నరేంద్ర (తెలంగాణ సాధన సమితి) వంటి వారు పార్టీలు పెట్టినప్పుడు, కేసీఆర్ వారిని చివరకు తన పార్టీలోనే విలీనం చేసుకునేలా రాజకీయ పరిస్థితులు సృష్టించారు.

సంస్థాగత లోపం

ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు బలం అవసరం కోదండరాం (టీజేఎస్) లేదా చెరుకు సుధాకర్ వంటి వారు మేధావి వర్గానికి చెందిన వారు. వారిపై ప్రజల్లో గౌరవం ఉన్నా, ఎన్నికల్లో ఓట్లను మేనేజ్ చేసే కార్యకర్తల నెట్‌వర్క్ వారికి లేదు. ఈ పార్టీలన్నీ దాదాపుగా ఒక వ్యక్తి లేదా కొద్ది మంది నేతల చుట్టూ తిరిగే ‘లెటర్ హెడ్’ పార్టీలుగానే మిగిలిపోయాయి.

భావోద్వేగం వర్సెస్ అధికారం ఉద్యమ సమయంలో ఉన్న భావోద్వేగం, రాష్ట్రం వచ్చిన తర్వాత మారిన రాజకీయ అవసరాల మధ్య చాలా పార్టీలు నలిగిపోయాయి.

తెలంగాణ వచ్చిన తర్వాత ‘తెలంగాణ’ పేరుతో పార్టీ ఉండడం కంటే, తెలంగాణను పాలించే శక్తి ఎవరికి ఉందనే కోణంలో ప్రజలు ఆలోచించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSTP) విషయంలో తెలంగాణ సెంటిమెంట్ కంటే ఆమెను ‘ఆంధ్రా’ మూలాలున్న వ్యక్తిగా ప్రజలు భావించడం వల్ల ఆమె నిలదొక్కుకోలేకపోయారు.

ఎన్నికల రాజకీయాలు నేడు చాలా ఖరీదైనవిగా మారాయి. ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఉన్న ఆర్థిక బలం ముందు ఈ చిన్న పార్టీలు నిలబడలేకపోయాయి. మీడియా కూడా గెలిచే గుర్రాల మీదనే దృష్టి పెడుతుంది. ఫలితంగా ఈ పార్టీల ఉనికి వార్తలకు మాత్రమే పరిమితమైంది.

స్పష్టత లేని సిద్ధాంతం..

కేసీఆర్‌పై కోపంతోనో, వ్యక్తిగత విభేదాల వల్లనో పార్టీలు పెట్టారు తప్ప, బలమైన సామాజిక మార్పు కోసం పార్టీలు తక్కువ. గద్దర్ (TUF) లేదా విమలక్క వంటి వారు ప్రజల గొంతుకగా నిలిచినా, వారి మార్గం ఓట్ల రాజకీయాలకు భిన్నంగా ఉందేది. తీన్మార్ మల్లన్న లేదా నాగం జనార్ధన్ రెడ్డి వంటి వారు పోరాటాలు చేసినా, చివరకు ఏదో ఒక పెద్ద పార్టీలో చేరక తప్పలేదు.

ఒక ప్రాంతం పేరు మీద పార్టీ పెట్టినప్పుడు, ప్రాంత ప్రజల నాడిని తెలుసుకోవడంతో కేసీఆర్ చూపినంత నేర్పు మరెవరూ చూపలేకపోయారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదిగితే.., దానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలిచాయి తప్ప, ఇతర చిన్న ప్రాంతీయ పార్టీ ఎదగడానికి తెలంగాణ సమాజం పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ప్రజల మద్దతు లేని భావోద్వేగం రాజకీయాల్లో నీటి బుడగ వంటిదని ఈ పార్టీల ప్రస్థానం మనకు నేర్పుతున్న పాఠం.




Tags:    

Similar News