ష‌ర్మిల‌పై ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారంటే

Update: 2022-11-29 12:30 GMT
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమ‌వారం షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో.. ప్రచారం రథంపై దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ షర్మిల ప్రగతిభవన్‌ వైపు వెళ్తుండగా.. పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు షర్మిలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఎంతకీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపో యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. పోలీ సులు ఆమెను కారులో నుంచి దించే ప్రయత్నం చేయగా.. కారు కిటికీలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు.

ఈ క్రమంలో కారుపై కూర్చుని వైటీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. 15 మందికి పైగా కార్యకర్తలు, నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ధ్వంస మైన కారు డ్రైవింగ్‌ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అనంతరం ఆమెను కారులో నుంచి దించి స్టేషన్లోకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఎస్‌.ఆర్. నగర్ పీఎస్ ఎదురుగా ఉన్న భవనం ఎక్కి వైటీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. భవనం ఎక్కి ఆందోళన చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసులు ఇవీ..షర్మిలపై ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్కి అంతరాయం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ 353, 333, 327 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు అయిన విషయం తెలుసుకున్న వైఎస్సార్టీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News