టీడీపీపై విజయసాయి రెడ్డి ఫైర్ ట్వీట్స్!

Update: 2019-06-25 06:35 GMT
వరస ట్వీట్లతో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి. వివిధ అంశాల గురించి ఆయన వరసగా హాట్ ట్వీట్స్ ను పెట్టారు. 'ప్రజావేదిక' కూల్చివేత - విజయవాడ-అమరావతి రింగురోడ్డు - అమ్మ ఒడి - ప్రత్యేకహోదా.. అంశాల గురించి ఆయన వరసగా  ట్వీట్ చేశారు. వాటి సంగతిలా ఉంది…

''నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవి. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు. ఇకపై సాధ్యం కాదు.

 విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్న యూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయి. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.

 అమ్మ ఒడి పథకం అన్ని పాఠశాలకు వర్తింపజేస్తామని సీఎం జగన్ గారు చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ పథకంపై రకరకాల వార్తలను వండి వార్చింది. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేస్తారనే విధంగా అనుమానాలు రేకిత్తించే ప్రయత్నం చేసింది.

 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి 303 మంది సభ్యులున్నారు. ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదు. అయినా హోదా కోసం పోరాడుతూనే ఉంటామని మా సీఎం గారు చెప్పారు. అధికారంలో లేనప్పుడు - ఉన్నప్పుడూ ఒకే మాట మీదున్నాం. చంద్రబాబులా హోదా సంజీవని కాదని ఎన్నడూ అనలేదు గదా?''

అంటూ వివిధ అంశాల గురించి స్పందించారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. 
Tags:    

Similar News