బీజేపీ తిండి తిని.. వైఎస్సార్సీపీ పాట పాడతావ

Update: 2020-02-08 13:30 GMT
రాజ‌ధాని వికేంద్రీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా టీడీపీ నాయకుడు వర్ల రామయ్య అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై వైఖరిని తప్పు బట్టారు. వైఎస్సార్సీపీ తో జీవీఎల్ అంటకాగుతున్నాడని, ఆ పార్టీతో జీవీఎల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ తిండి వైఎస్సార్సీపీ పాట పాడుతావా అని ప్రశ్నించారు.

రాజధాని విషయంలో ఏపీ బీజేపీ వ్యతిరేకిస్తుంటే ఢిల్లీలో ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆ అంశం రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టం చేశారు. అది కేంద్ర ప‌రిధిలోని అంశం కాద‌ని, తాము జోక్యం చేసుకునేది లేద‌ని జీవీఎల్ స్ప‌ష్టం చేశాడు. దీనికి అనుగుణంగానే ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో కేంద్ర‌ హోంశాఖ స‌హాయ మంత్రి కూడా లిఖిత పూర్వ‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో జీవీఎల్ తీరుపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో వర్ల రామయ్య అతడి పై మండి పడ్డారు.

జీవీఎల్ బీజేపీ నేత అనే విష‌యాన్ని మ‌రిచిపోయాడని, మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న జీవీఎల్.. ఓ పనికిమాలిన ఎంపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా జీవీఎల్ మాట్లాడటంలో మతలబు ఏంటి? అని ప్ర‌శ్నించాడు. జగన్‌ను ఏకాంతంగా ఎందుకు కలిశారని, ఇటీవ‌ల ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైఎస్సార్సీపీ ముఖ్య నేతను జీవీఎల్ ఎందుకు కలిశారని, మూడు రాజధానులపై జీవీఎల్ కారుకూతలు కూయడం మానుకోవాలని కోరాడు. జీవీఎల్‌ కు ధైర్యముంటే రాజధానిలో పర్యటించాలని ఈ సందర్భం గా సవాల్ విసిరాడు. బీజేపీ కూడు తింటూ,  వైఎస్సార్సీపీ పాట పాడుతున్నాడని తెలిపాడు.


Tags:    

Similar News