టీడీపీలో మరో కుదుపు- వంగవీటి రాధా అవుట్ ?

Update: 2019-06-24 09:30 GMT
విహార యాత్రకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అది విషాద యాత్రగా మారింది. ఐదు రోజుల ఈ పర్యటన జరుగుతుండగా ఆయన ఏ రోజు ప్రశాంతంగా లేకుండా రోజుకో సంచలన సంఘటనలు జరుగుతున్నాయి. రాజ్యసభలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు పార్టీ మారిన నేపథ్యంలో పార్టీలో గందరగోళం ఏర్పడింది. గత ఐదేళ్లలో పార్టీ నేతలపై, అధినేతపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరి క్షేమం వారు చూసుకుంటున్నారు. టీడీపీలో కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టార్గెట్ అవడం తప్ప ఒరిగేదేం లేదని తమ దారులు వెతుక్కుంటున్నారు. ఆ క్రమంలో ఈ రోజు కూడా ఒక సంచలనం చోటుచేసుకుంది.

కాపు సామాజికవర్గంలో కీలక  నేత అయిన వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. రాధా పవన్ ను కలిసి బయటకు వచ్చేదాకా ఈ సమాచారం రహస్యంగానే ఉంచారు. గంటన్నరకు పైగా ఇద్దరు సమావేశమైన అనంతరం రాధాను పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా కూడా జనసేనలో చేరడానికి సుముఖత వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం.

గత ఎన్నికల్లో పదేపదే నేను ఒక వర్గం కాదు, కాపు కులం కోణంలో వచ్చేలా ఉంటే నా వద్దకు రావద్దు ... కులముద్రకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు దారుణంగా బెడిసికొట్టాయి. కాపులకు ఏ పదవి ఇచ్చినా మీడియా ఉతికారేసింది. దీంతో కులాన్ని దూరం పెట్టడం వల్ల నష్టం తప్ప లాభం లేదని కొందరు సన్నిహితులు సూచించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్... తన సామాజిక వర్గంలో కీలక నేతలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగమే వంగవీటి రాధాతో సమావేశం. కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రత్యర్థులను ఏకం చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నా అది ఫలితాలను ఇవ్వలేదు. ఇపుడు మళ్లీ ఆ వర్గాలు రెండు వేరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా సుదీర్ఘ విబేధాలు అనంతరం వెంటనే కలిసిపోవడం కూడా అంత సులువేం కాదు. ఏదేమనా తెలుగుదేశం పార్టీకి ఉదయాన్ని ప్రజావేదిక కూల్చివేతతో పెద్ద షాక్ తగిలితే మధ్యాహ్నానికి వంగవీటి షాక్ తగిలింది. ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో చంద్రబాబునాయుడు.
 


Tags:    

Similar News