సంచయితపై ఊర్మిల గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

Update: 2020-10-07 07:30 GMT
విజయనగరం రాజులైన ‘గజపతిరాజు’ కుటుంబంలో పంచాయితీ రచ్చ కెక్కుతోంది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గద్దెదించి వారి సంస్థ మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు.. ఇతర ఆస్తులకు చైర్మన్ అయిన సంచయిత దూకుడు వారి కుటుంబంలో చిచ్చుపెడుతోంది.

తాజాగా మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని మహారాజ(ఎంఆర్) కళాశాలను ప్రైవేట్ పరం చేయడంపై ఇప్పటికే టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఉర్మిళ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.  మంగళవారం పూసపాటి ఉర్మిళ మీడియాతో మాట్లాడారు.

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై సీఎం జగన్ ను కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోసం ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నామని.. ఇప్పటికీ దొరకలేదని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన మహారాజా కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ఉర్మిళ అన్నారు.

మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుపై పూసపాటి ఉర్మిళ మండిపడ్డారు. సంచయిత తన తాత, తండ్రి పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. ఎంఆర్ కళాశాలలో చదువుకున్న వారు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఉర్మిళ తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థను ప్రైవేట్ పరం చేయడాన్ని తాము ఒప్పుకోమని తేల్చిచెప్పారు. ఎంఆర్ కాలేజీని ప్రైవేట్ పరం చేయవద్దని ఉర్మిళ ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

కాగా ఎంఆర్ కాలేజీని 1879లో పూర్వీకులైన మహారాజ విజయరామ గజపతిరాజు గారు విజయనగరంలో స్థాపించారు. అతితక్కువ ఫీజుతో విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించారు. ఈ కాలేజీకి గొప్ప చరిత్ర ఉంది.
Tags:    

Similar News